విజయనగరం : సాధారణంగా చిన్నపిల్లలు వీడియో గేమ్స్ లేదా కంప్యూటర్ గేమ్స్తో కాలాన్ని గడుపుతారు. కానీ విజయనగరంకు చెందిన 1వ తరగతి చదువుతున్న ఐదేళ్ల బాలుడు గరుగుబెల్లి కూనల్ కష్టసాధ్యమైన జనరల్ నాలెడ్జ్, కరెంట్ అఫైర్స్ సులభంగా చెప్పేస్తూ భలే … బుడతడు..! అనిపిస్తున్నాడు..! ది వైజాగ్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఫస్ట్ స్టాండర్డ్ చదువుతున్న కూనల్ 140 కు పైగా దేశాలకు సంబంధించిన జాతీయ పతాకాలను అవలీలగా గుర్తుపట్టడమే గాక, వందకు పైగా దేశాలకు సంబంధించిన సమాచారాన్ని, వివిధ సముద్రాలు, వివిధ ఖండాలు, చారిత్రాత్మక యుద్ధాలు, ప్రదేశాలు, రాజధానులు, తదితర అంశాలను అడిగిన వెంటనే చెప్పి అబ్బురపరిచాడు. ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ సంఘం విజయనగరం జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఈ రోజు గురజాడ స్మారక గ్రంథాలయంలో బాలమేధావి కూనల్ ప్రదర్శన విజయవంతంగా ఇచ్చాడు. ఈ సందర్భంగా లోక్సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీసెట్టి బాబ్జి తో కలిసి ఎపి గ్రంథాలయ సంఘం జిల్లా అధ్యక్షులు సముద్రాల గురుప్రసాద్ బాలమేధావికి పతకాన్ని, బహుమతిని అందించి అభినందించారు. ఈ సమావేశంలో సంఘం జిల్లా కార్యదర్శి ముళ్లపూడి సుభద్రాదేవి, గిరిజా ప్రసన్న, ఎం చంద్రశేఖర్, బాలమేధావి తల్లి దండ్రులు అశోక్, రాజులమ్మ దంపతులు పాల్గొన్నారు.
