అమరావతి : తెలుగు రాష్ట్రాల్లో బర్డ్ ఫ్లూ కలకలం రేగడంతో మాంసాహారప్రియులు చికెన్ దుకాణాల వైపు చూడటమే మానేశారు. దీంతో చేపలు, రొయ్యలు, మటన్ కి డిమాండ్ పెరిగింది. ఇప్పటివరకు రూ.800 వరకు ఉన్న కిలో మటన్ ఏకంగా వెయ్యి రూపాయలు ధర పలుకుతుంది. చికెన్ తినడం మానేసిన ప్రజలు… ఈరోజు ఆదివారం కావడంతో మటన్ షాప్ల వద్ద క్యూ కట్టారు. సాధారణంగా ఆదివారం లేదా సెలవు దినాల్లోనే ఎక్కువగా అమ్ముడయ్యే మటన్ … ప్రస్తుతం రోజువారీ లెక్కచొప్పున భారీగా అమ్ముడవుతోంది. ప్రజలు భద్రత కోసం ఈ ప్రత్యామ్నాయాలను ఎంచుకోవడం వల్ల మార్కెట్లో అసమతుల్యత ఏర్పడింది.
ధరలను ఆసరాగా చేసుకున్న వ్యాపారులు
మటన్కి ఉన్న భారీ డిమాండ్ను ఆసరాగా తీసుకొని వ్యాపారులు ధరలను గణనీయంగా పెంచేశారు. సాధారణంగా కిలో రూ.800 వరకు ఉండే మటన్ ధర ప్రస్తుతం రూ.1000 నుంచి రూ.1100 వరకు పెరిగింది. కొన్ని ప్రాంతాల్లో అయితే మరింత ఎక్కువగా కూడా విక్రయిస్తున్నారు. ఒక్కసారిగా పెరిగిన ధరలతో సామాన్యులకు అందకుండా మటన్ ధర కొండెక్కింది. ప్రజల అవసరాన్ని లాభదోపికగా మార్చుకుంటున్న వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకోవాలని వినియోగదారులు డిమాండ్ చేస్తున్నారు.
ప్రభుత్వ జోక్యం అవసరం..
మటన్, చేపల ధరలు ఇలా పెరగడం వల్ల సామాన్య ప్రజలకు ఇది ఆర్థిక భారం అవుతోంది. మార్కెట్లో ధరలను నియంత్రించడానికి అధికారులు జోక్యం చేసుకోవాల్సిన అవసరం ఉంది. వ్యాపారులు కావాలని అధిక ధరలకు విక్రయిస్తే, ఆ చర్యలపై కఠినంగా వ్యవహరించాలని వినియోగదారుల సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. ప్రజలు బర్డ్ ఫ్లూ భయంతో చికెన్ తినడం తగ్గించినా, మటన్ ధరలు సామాన్యులకు అందుబాటులో ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉంది.
ప్రజలకు అవగాహన అవసరం …
ఇప్పుడు ప్రజలు బర్డ్ ఫ్లూ గురించి మరింత అవగాహన పెంచుకోవాలి. వైద్యులు సూచించిన విధంగా, సరైన ఉష్ణోగ్రత వద్ద ఉడికించినా చికెన్ భద్రంగా తినవచ్చని నిపుణులు చెబుతున్నారు. అయితే ప్రజలు ఇప్పటికీ జంకుతూ ఉండటంతో మటన్, చేపల వంటి ఆహార పదార్థాలకు డిమాండ్ పెరిగింది. దీనివల్ల వ్యాపారులు రేట్లను పెంచుతున్నారు. పరిస్థితిని అదుపులోకి తీసుకురావాలంటే, ప్రభుత్వ నిర్బంధ చర్యలతో పాటు, ప్రజలు కూడా సరైన అవగాహన పెంచుకోవాలి.