ఇంటర్నెట్ : భూమి తనచుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరిగుతుందని తెలుసు. దీనినే భూభ్రమణం.. భూపరిభ్రమణం అంటారు. అయితే, ఇవి మన కంటికి కనిపించవు. కానీ, భారతీయ ఖగోళ శాస్త్రవేత్త డోర్జే అంగ్చుక్ భూభ్రమణానికి సంబంధించిన అద్భుత దఅశ్యాలను వీడియో తీశారు. లడఖ్లో భూమి భ్రమిస్తున్న వీడియోను టైమ్లాప్స్లో ఆయన బంధించారు. హాన్లేలోని ఇండియన్ ఆస్ట్రోనామికల్ అబ్జర్వేటరీ (ఐఐఏ) ఇంజినీర్-ఇన్ఛార్జిగా అంగ్చుక్ పనిచేస్తున్నారు. 24 గంటల పాటు టైమ్లాప్స్ను ఉపయోగించి ఆయన ఈ వీడియో తీశారు. ఈ మొత్తాన్ని ఒక నిమిషం వీడియోగా మార్చి సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ప్రస్తుతం ఇది వైరల్ అవుతోంది. ఈ వీడియోలో భూమి ఏలా తిరుగుతుందో స్పష్టంగా కనిపిస్తోంది. అంగ్చుక్ మాట్లాడుతూ.. నక్షత్రాలు నిశ్చలంగా ఉంటే, భూమి పరిభ్రమిస్తూ ఉంటుందని తెలిపారు. వీడియోలో బంధించడానికి చాలా ఇబ్బందులు పడినట్లు పేర్కొన్నారు. ఇది నా ఓర్పు, సహనాన్ని పరీక్షించిందని చెప్పారు. ”మొదట్లో ఓరియన్ను ఫ్రేమ్లో బంధించాలని భావించాను… కానీ అది ఆకాశంలో 4 అక్షాంశాల ఎత్తులో ఉంది… విపరీతమైన చలి మరింత కఠినతరం చేసింది.. బ్యాటరీ ఛార్జింగ్ వేగంగా తగ్గిపోయింది…” అని తెలిపారు.
సవాళ్లను అధిగమించి…
‘కెమెరా స్టోరేజ్, బ్యాటరీ వైఫల్యం, టైమర్ పనిచేయకపోవడం వంటి అనేక సవాళ్లతో నాలుగు రాత్రుల పాటు కఠిన పరిస్థితులను ఎదుర్కొన్నాను.. ప్రతి సందర్భంలోనూ అవాంతరం ఏర్పడింది.. ఒకదశలో విరమించుకోవాలని నిర్ణయానికి వచ్చాను కూడా.. భ్రమణం, మొబైల్ సెటప్ను మార్గనిర్దేశం చేసే ట్రాకర్తో ప్రతికూలతను అధిగమించి చివరకు సజావుగా సంగ్రహించాను… అయినప్పటికీ, పోస్ట్ప్రాసెసింగ్ సవాళ్ల తప్పలేదు.. ఫ్రేమింగ్లో వ్యత్యాసం కారణంగా క్రాప్ చేయాల్సి వచ్చింది.. చివరికి ఆ ప్రయత్నం ఫలించింది’ అని చెప్పారు.
విద్యార్థులకు సులువుగా అర్థమయ్యేలా …
భూ భ్రమణం గురించి విద్యార్థులు సులువుగా అవగాహన చేసుకునేలా వీడియో రూపొందించాలని వచ్చిన అభ్యర్థన మేరకు ఈ ప్రాజెక్ట్ చేపట్టినట్లు అంగ్చుక్ పేర్కొన్నారు. లడఖ్లోని విపరీతమైన శీతల వాతావరణం వల్ల వీడియో చిత్రీకరిస్తున్న నాలుగు రాత్రుల్లో చాలాసార్లు బ్యాటరీ వైఫల్యాలు, టైమర్ పని చేయకపోవడం వంటివి ఎదుర్కొన్నా…. కానీ ఎలాగైనా వీడియో రూపొందించాలనే ఆలోచనతో ముందుకు వెళ్లానని ఆయన అన్నారు. లడఖ్లో అతి శీతల వాతావరణం వల్ల కెమెరాలు, బ్యాటరీలు కూడా పనిచేయడానికి మొరాయించాయని అంగ్చుక్ తెలిపారు. కానీ, ఈ సవాల్ను అధిగమించాలని నిర్ణయించుకుని పట్టుదలతో వెళ్లడంతో సాధ్యమైందని ఆయన వివరించారు.