పూడూరు : బిర్యానిలో ఇనుప పీచు ముక్కలు రావటంతో నిలదీసిన కస్టమర్లపై హోటల్ నిర్వాహకులు దాడి చేసిన ఘటన ఆదివారం పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలోని ఓ హోటల్లో జరిగింది. ఎస్సై మధుసూదన్ రెడ్డ్డి కథనం మేరకు … చేవెళ్ల మండలం రేగడిఘనాపూర్క్న్ చెందిన బేగరి శంకర్, మహేంద్, నాగరాజు, సురేశ్, మరో ఇద్దరు కలిసి ఆదివారం మధ్యాహ్నం పూడూరు మండలం అంగడిచిట్టంపల్లిలోని ఓ హోటల్లో భోజనం చేయడానికి వెళ్లారు. బిర్యాని ఆర్డర్ ఇచ్చారు. అయితే ఆ బిర్యానీలో బేషిన్లను తోమే సబ్బుకు ఉపయోగించే ఇనుప పీచు ముక్కలు వచ్చాయి. ఈ విషయాన్ని కస్టమర్లు హోటల్ నిర్వాహకులకు తెలిపారు. దానికి బదులుగా వేరే రైస్ ఇస్తామని చెప్పి సరైంది ఇవ్వకపోవటంతో కస్టమర్లకు, నిర్వాహకులకు మధ్య గొడవ జరిగింది. ఈ ఘర్షణలో హోటల్ నిర్వాహకులు కలిసి కస్టమర్లపై దాడి చేశారు. ఈ దాడిలో నలుగురికి దెబ్బలు తగిలాయి. మరో ఇద్దరు అక్కడి నుండి వెళ్లిపోయారని ఎస్ఐ వివరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.