న్యూఢిల్లీ : ఎయిర్ ఇండియా విమానంలో ఇద్దరు ప్రయాణికులు ఆర్మ్ రెస్ట్ కోసం కొట్టుకున్నారు. డెన్మార్క్ నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానం ఎకానమి తరగతిలో సీటు పక్కన చేయి పెట్టుకునే ఆర్మ్ రెస్ట్ విషయంలో ఇద్దరు ప్రయాణికుల మధ్య మొదట మాటల యుద్ధం జరిగింది. విమానంలోని క్యాబిన్ సిబ్బంది వారి సమస్యను పరిష్కరించి అందులో ఒకరికి దూరంగా మరో సీటును కేటాయించారు. ఆదివారం ఉదయం ఢిల్లీ ఎయిర్పోర్టులో విమానం ల్యాండ్ అయిన తర్వాత వేరే సీటుకు వెళ్లిపోయిన ప్రయాణికుడు తన లగేజ్ కోసం తన పాత సీటు వద్దకు మళ్లీ వచ్చాడు. ఈ సమయంలో మళ్లీ ఇద్దరి మధ్య మాటల తూటాలు పేలాయి. ఈసారి గొడవ ఏకంగా ఒకరిపై ఒకరు పిడిగుద్దులు గుద్దుకునే వరకు వెళ్లింది. ట్విస్ట్ ఏంటంటే ? ఆ ఇద్దరి గొడవ చివరకు సమసిపోయిందని, ఇద్దరు స్నేహపూర్వకంగా షేక్ హ్యాండ్ ఇచ్చుకొని ఎయిర్పోర్టు నుంచి వెళ్లిపోయారని ఎయిరిండియా అధికారులు తెలిపారు.