యానాం : గోదారోళ్ల ఆతిథ్యానికి ప్రత్యేకత ఉంటుంది. పండగొచ్చిందంటే గోదావరి జిల్లాల ప్రజలు ఇంటికొచ్చే బంధువుల పట్ల కనబరిచే ఆప్యాయతకు అంతే ఉండదు. ఇక ఇంటికొచ్చిన కొత్తల్లుడికి చేసే మర్యాదలు మరో స్థాయిలో ఉంటాయి. యానాం వర్తక సంఘం గౌరవాధ్యక్షుడు మాజేటి సత్యభాస్కర్, వెంకటేశ్వరి దంపతుల ఏకైక కుమార్తె హరిణ్యకు గతేడాది విజయవాడకు చెందిన సాకేత్తో వివాహం జరిపించారు. కొత్త అల్లుడిని మొదటి సంక్రాంతి పండుగకు ఆహ్వానించి ప్రత్యేక విందును ఏర్పాటు చేశారు. శాకాహారం, పిండి వంటలు, స్వీట్లు, పండ్లు, ఇలా సుమారు 470 రకాలు చిన్న కప్పులలో ఉంచి అల్లుడు, కుమార్తె ఇద్దరినీ విందుకు ఆహ్వానించారు. ఈ మెగా విందులో వంటకాలు చూసి అల్లుడు సాకేత్ ఉబ్బితబ్బిబ్బయ్యారు.
