May 25,2023 21:22

గురుగ్రామ్‌ : దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2018 రక్బర్‌ ఖాన్‌ హత్య కేసులో నలుగురు గోగూండాలకు అల్వార్‌లోని జిల్లా కోర్టు గురువారం ఏడేళ్ల జైలు శిక్ష విధించింది. ఒక నిందితుడిపై ఆరోపణలను నిరూపించడంలో ప్రాసిక్యూషన్‌ విఫలమవ్వడంతో అతన్ని నిర్ధోషిగా విడుదల చేశారు. 2018 జులై 20 రాత్రిపూట రక్బర్‌ ఖాన్‌ తన స్నేహితుడు అస్లాం ఖాన్‌తో కలిసి కాలినడక తమ ఇంటికి ఆవులను తీసుకుని వెళుతుండగా గోగూండాలు ఒక్కసారిగా దాడికి పాల్పడ్డారు. ఈ దాడి నుంచి అస్లాం ఖాన్‌ ఏదో విధంగా తప్పించుకోగా, రక్బర్‌ ఖాన్‌ను గోగూండాలు దారుణంగా కొట్టి చంపారు. ఈ ఘటన అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో నరేష్‌, విజరు, పరమజీత్‌, ధర్మేంద్రలకు ఒకొక్కరికీ ఏడేళ్ల జైలు శిక్షను అదనపు జిల్లా జడ్డి సునీల్‌ కుమార్‌ గోయల్‌ విధించారు. మరో నిందితుడు నవాల్‌పై ఆరోపణలను రుజువు చేయకపోవడంపై విడిచిపెట్టారు.