Mar 18,2023 22:15

ముంబయి: డివై పాటిల్‌ వేదికగా శనివారం జరిగిన మరో పోటీలో ముంబయి ఇండియన్స్‌ జైత్రయాత్రకు బ్రేక్‌ పడింది. ఈ టోర్నీలో భాగంగా వరుసగా 5మ్యాచుల్లో గెలిచిన ముంబయి జట్టు శనివారం యుపి వారియర్స్‌ చేతిలో 5వికెట్ల తేడాతో ఓటమిపాలైంది. తొలిగా బ్యాటింగ్‌కు దిగిన ముంబయి జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 127పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్‌ హీలీ మాథ్యూస్‌(35), కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌(25), వాంగ్‌(32) మాత్రమే బ్యాటింగ్‌లో రాణించారు. ఎక్లేస్టోన్‌కు మూడు, దీప్తి, గైక్వాడ్‌కు రెండేసి వికెట్లు దక్కాయి. ఛేదనలో భాగంగా యుపి వారియర్స్‌ టాపార్డర్‌ నిరాశపరిచినా.. మెక్‌ గ్రాత్‌(38), గ్రేస్‌ హర్రీస్‌(39) బ్యాటింగ్‌లో రాణించారు. చివర్లో దీప్తి(13నాటౌట్‌), ఎక్లేస్టోన్‌(16నాటౌట్‌) క్రీజ్‌లో నిలిచి మ్యాచ్‌ను ముగించారు. దీంతో యుపి జట్టు 19.3ఓవర్లలో 5వికెట్లు కోల్పోయి 129పరుగులు చేసి గెలిచింది.