Aug 18,2022 20:53

సినీ ఇండిస్టీలో ప్రస్తుతం నెలకొన్న సమస్యలపై ఫిలిం ఛాంబర్‌ ఆధ్వర్యంలో నాలుగు కమిటీలు వేసి చర్చిస్తున్నారు. తాజాగా ఫిలిం ఛాంబర్‌ సభ్యులు తాము తీసుకున్న కొత్త నిర్ణయాలు వెల్లడించేందుకు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా దిల్‌ రాజు మాట్లాడుతూ.. 'ఆగస్టు 1 నుంచి షూటింగ్‌లు ఆపేసి కమిటీలు వేసుకున్నాం. నిర్మాతలుగా మేము కొన్ని నిర్ణయాలు తీసుకున్నాం. 8 వారాల తర్వాతే సినిమాను ఓటీటీలో రిలీజ్‌ చేయాలని నిర్ణయించుకున్నాం. టికెట్‌ రేట్లు కూడా తగ్గించాలని భావిస్తున్నాం. థియేటర్లు, మల్టీప్లెక్సులతో మాట్లాడాం.. సినీప్రియులకు టికెట్‌ రేట్లు తగ్గించి ఇవ్వాలని డిసైడ్‌ అయ్యాం. ఇక సినిమాలో ఎందుకు వృథా ఖర్చు అవుతుందనేది చర్చించాం. షూటింగ్స్‌ ఎప్పుడు ప్రారంభం కావాలనేది నిర్ణయం తీసుకోలేదు. మరో మూడు నాలుగు రోజుల్లో ఫైనల్‌ మీటింగ్స్‌ ఉన్నాయి, ఆ తర్వాతే అన్నీ వివరంగా చెప్తాం' అని చెప్పారు. ఈ సమావేశానికి సి. కల్యాణ్‌, మైత్రి రవి, దామోదర ప్రసాద్‌, బాపినీడు  డైరెక్టర్‌ తేజ తదితరులు హాజరయ్యారు.