
కెనడా : 'వీధుల వీధుల విభుడేగే' అనే అన్నమయ్య కృతిలో ఉన్నట్టు కెనడా వ్యాప్తంగా ఆరు ప్రావిన్స్ ల నుండి 108 విలక్షణమైన అన్నమయ్య కృతులతో 11 గంటల పాటు అన్నమయ్య ఆరాధనోత్సవాలు ఘనంగా జరిగాయి. తెలుగుతల్లి కెనడా లక్ష్మి రాయవరపు వారి బృందం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ప్రఖ్యాత తెలుగు సినిమా కథ, పాటల రచయిత సుద్దాల అశోక్ తేజ, యస్ పి వసంత లక్ష్మి ముఖ్య అతిథులుగా విచ్చేసారు. ఉమా సలాది దీప ప్రజ్వలన చేయగా పాణంగిపల్లి విజయలక్ష్మి ప్రార్థన గీతంతో సభ మొదలైంది. అశోక్ తేజ మాట్లాడుతూ జీవితంలో ప్రతి సందర్భంలోనూ అతి చిన్న పదాలతో జనాలు నాల్కల మీద తిరిగే రచనలు వ్రాసిన అన్నమయ్య తన వంటి ఎందరో రచయితలకి మార్గ దర్శకులు అయ్యారన్నారు. అన్నమయ్య గురించి చేసిన ప్రసంగంలో ఎన్నో ఆసక్తి కరమైన విషయాలు తెలియజేశారు. ఇలాంటి కార్యక్రమాలు నిర్వహణ ద్వారా తెలుగుతల్లి కెనడా భావి తరాలకు మంచి సంస్కృతి, సంస్కారాన్ని అందిస్తుందని వారు అన్నారు.
తెలుగుతల్లి కెనడా తరఫున వారి భార్య నిర్మల చేతుల మీదుగా సత్కారం పొందడం చాలా ఆనందం కలగజేసింది ఈ కొత్త రకం సత్కారం ఏర్పాటు చేసిన తెలుగు తల్లి కమిటీ వారు అభినందించారు. యస్ పీ వసంత లక్ష్మి మాట్లాడుతూ... ఎప్పుడు విదేశాలకి ప్రయాణం చెయ్యలేదని ఈనాడు కెనడా వచ్చిన అనుభూతి కలిగిందని చెప్పారు. చక్కని ఆత్మీయమైన మాటలతో, పాటతో వారు అందరినీ అలరింపజేసారు.
తెలుగుతల్లి కెనడా లక్ష్మి రాయవరపు గొప్ప జాతీయవాది. తెలుగు జాతి అభిమాని. లక్ష్మి మాట్లాడుతూ మన తెలుగు భాషలో ఎన్నో గొప్ప భక్తి గీతాలు, మహాభారతం, రామాయణం, భాగవతం ఎన్నో ఉన్నాయి. అన్నమయ్యకు పదకవితా పితామహుడు అని బిరుదు ఉందన్నారు.. తిరుమల శ్రీ వేంకటేశ్వరస్వామిని, అహోబిలంలోని నరసింహ స్వామిని, కీర్తిస్తూ 32 వేలకు పైగా కీర్తనలు రచించారు. అన్నమయ్య పాటలు, పదాలు, పద్యాలలో భక్తి, సాహిత్యం, పెనవేసికొని ఉంటాయి. తెలుగు భాషకి అత్యున్నత వైభవం అన్నమయ్య కృతులు దేశ విదేశాలకు పరిచయం చేయాలనే సంకల్పం.
తెలుగుతల్లి కెనడా సంస్థకు సహకరిస్తున్న పత్రిక కమిటీని, వివాహ వేదిక కమిటీని, యూట్యూబ్ కమిటీని , పిల్లల మాసపత్రిక గడుగ్గాయి కమిటీని పరిచయం చేస్తూ తెలుగుతల్లి కెనడా లక్ష్మి రాయవరపు ప్రతి సంవత్సరం ఈ వేడుకలు వివిధ ప్రదేశాలలో జరుగుతున్నప్పటికీ, దేశవ్యాప్తంగా ఒక వేదిక మీద జరగడం గత సంవత్సరం మొదలు పెట్టారు. త్యాగరాజ ఉత్సవాల్లో గుర్తింపు పొందిన ఒక సీనియర్ గాయని/ గాయకునికి జీవన సాఫల్య పురస్కారం అందించడం ఎంతో అదృష్టం గా భావిస్తున్నామని తెలుగుతల్లి కెనడా నిర్వాహకులు పేర్కొన్నారు.
తెలుగుతల్లి కెనడా వెబ్ మాసపత్రికతో పాటు ప్రతినెలా అనేక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా దేశంలో ఉన్న ప్రతిభావంతులైన వారందరినీ ఒక చోట చేర్చడం తన లక్ష్యమని తెలుగుతల్లి కెనడా వ్యవస్థాపకులు లక్ష్మి రాయవరపు తెలిపారు. అతిథులకు భాస్కర వర్మ వందన సమర్పణతో మొదటి సభ ముగిసి, 10 గంటల పాటు 108 విలక్షణమైన అన్నమయ్య కీర్తనలు 4 నృత్యాలు, వీణా వాదనలతో కెనడా ప్రతిభ చూపరులను కదలకుండా కట్టి పడేసింది. భారత , కెనడా, అమెరికా దేశాల నుంచి పలువురు ప్రముఖ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.