
- ఇమ్రాన్ పార్టీకి దెబ్బ మీద దెబ్బ
ఇస్లామాబాద్ : పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి ఇమ్రాన్ఖాన్కు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది. మే9న ఆయన అరెస్టు దగ్గర నుండి పాకిస్థాన్ తెహ్రీక్-ఇ-ఇన్సాఫ్ (పిటిఐ) నుంచి కీలక నేతలు ఒక్కొక్కరు వివిధ కారణాలతో వైదొలగుతున్నారు. పార్టీ ఉపాధ్యక్షుడు, మాజీ మంత్రి ఫవాద్ చౌదరి వైదొలగిన మరుసటి రోజే మరో మాజీ మంత్రి అసద్ ఉమర్ పార్టీ నుంచి తాను తప్పుకుంటున్నానని ప్రకటించారు. వీరిద్దరితోబాటు మరో డజను మంది దాకా పార్టీ పదవుల నుంచి తప్పుకోవడమో లేక పార్టీ నుంచి వైదొలగడమో చేశారు. ఈ రాజీనామాలు స్వచ్ఛందంగా చేసినవా లేక బయట నుంచి ఒత్తిళ్లకు తలొగ్గి చేసినవా అనేది ప్రశ్న. ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పిటిఐ ప్రధాన కార్యదర్శి అసాద్ ఉమర్ తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఇమ్రాన్ఖాన్కు అత్యంత సన్నిహితుల్లో ఒకరిగా అసాద్ ఉమర్కు పేరు ఉంది. ఇమ్రాన్ ఖాన్ మంత్రి వర్గంలో సమాచార మంత్రిగానూ పని చేశారు. అదైలా జైలు నుంచి విడుదలైన అనంతరం అసాద్ ఉమర్ ఈ ప్రకటన చేశారు. ఇమ్రాన్ఖాన్ అరెస్టుకు నిరసనగా మిలిటరీ ప్రధానకార్యాలయం ఎదుట పిటిఐ కార్యకర్తలు, ఇమ్రాన్ ఖాన్ అభిమానులు ఆందోళనకు దిగిన సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన కేసులో ఉమర్తో సహా ఫవాద్ చౌదరీ, షైరీన్ మజరీస్ వంటి అనేక మంది పిటిఐ నాయకులను పోలీసులు అరెస్టు చేశారు. జైలు నుంచి విడుదలై వచ్చినవారు పార్టీతో సంబంధాలను తెగతెంపులు చేసుకుంటున్నట్లు ప్రకటించడం చర్చనీయాంశమైంది. పిటిఐ చీప్ ఇమ్రాన్ మాత్రం ఇవి బలవంతపు విడాకులని వ్యాఖ్యానించారు.
పాక్లో 'అప్రకటిత మార్షల్ లా' : సుప్రీంలో ఇమ్రాన్ ఖాన్ పిటీషన్
ప్రస్తుతం పాకిస్థాన్లో 'అప్రకటిత మార్షల్ లా' అమల్లో ఉందని ఆ దేశ మాజీ ప్రధాని ఇమాన్ర్ ఖాన్ ఆరోపించారు. ఈ మేరకు పాకిస్థాన్ సుప్రీంకోర్టులో ఇమ్రాన్ఖాన్ పిటీషన్ వేశారు. అనేక రాష్ట్రాల్లో ప్రజా పరిపాలనకు సహాయం చేయడానికి సైన్యాన్ని మోహరించడాన్ని ఈ పిటీషన్లో సవాల్ చేశారు. పంజాబ్, ఖైబర్ పక్తుంఖ్వా, బులూచిస్తాన్, ఇస్లామాబాద్తో సహా పలు రాష్ట్రాల్లో షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం ఆర్టికల్ 245ను అమలు చేయడాన్ని ఇమ్రాన్ఖాన్ ప్రశ్నించారు. పాకిస్థాన్ రాజ్యాంగంలోని ఆర్టికల్ 245 ప్రకారం దేశాన్ని రక్షించడానికి ప్రజా పరిపాలనకు సహాయం చేయడానికి సైన్యాన్ని పిలవవచ్చు. అయితే ఆర్టికల్ 245 అమలు చేసే విధంగా దేశంలో పరిస్థితులు లేవని ఇమ్రాన్ఖాన్ తన పిటీషన్లో తెలిపారు. ఈ పిటీషన్లో ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్, పిఎంఎల్-ఎన్ నాయకులు, మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్, షరీఫ్ కుమార్తె నవాజ్, మాజీ అధ్యక్షులు ఆసిఫ్ అలీ జర్దారీ, విదేశాంగ మంత్రి బిలావల్ భుట్టో జర్దారీ ఇతరులను ప్రతివాదులుగా పేర్కొన్నారు.