Jun 22,2022 20:53

డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లపై సిబిఐ కేసులు
న్యూఢిల్లీ : 
భారత బ్యాంక్‌లకు కార్పొరేట్ల కుచ్చుటోపిలు కొనసాగుతూనే ఉన్నాయి. రియల్‌ ఎస్టేట్‌ రంగాలకు అప్పులు, పెట్టుబడులను జారీ చేసే దివాన్‌ హౌజింగ్‌ ఫైనాన్స్‌ లిమిటెడ్‌ (డిహెచ్‌ఎఫ్‌ఎల్‌) దేశంలోని 17 బ్యాంక్‌లకు రూ.34,615 కోట్ల మేర మోసం చేసింది. ఈ కేసుకు సంబంధించి డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ డైరెక్టర్లు కపిల్‌ వాధావన్‌, ధీరజ్‌ వాధవాన్‌ సహా మరికొందరిపై సిబిఐ తాజాగా కేసులు నమోదు చేసింది. ఈ కేసులో 50 మంది పైగా సిబిఐ అధికారులు నిందితులకు సంబంధించిన 12 ప్రదేశాల్లో సోదాలు నిర్వహించారు. ఇందులో అమరిల్లిస్‌ రియల్టర్స్‌కు చెందిన సుధాకర్‌ శెట్టి సహా మరో ఎనిమిది మంది ఇతర బిల్డర్లు కూడా ఉన్నారు. 2010-2018 కాలంలో డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ వివిధ బ్యాంక్‌ల నుంచి రూ.42,871 కోట్ల రుణాలు పొందింది. కాగా 2019 నుంచి తిరిగి చెల్లించడంలో విఫలమయ్యింది. దీంతో ఆయా బ్యాంక్‌లు ఈ ఖాతాలను ఎన్‌పిఎలుగా మార్చాయి. తీసుకున్న రుణాలను అడ్వాన్స్‌ల రూపంలో సంబంధిత, పరస్పరం అనుసంధానితమై ఉన్న సంస్థలు సహా వ్యక్తులకు నిధులను మళ్లించిందని బ్యాంక్‌లు ఆరోపిస్తున్నాయి. డిహెచ్‌ఎఫ్‌ఎల్‌ ప్రమోటర్లతో ఉమ్మడిగా ఉన్న 66 సంస్థలకు రూ. 29,100.33 కోట్ల నగదు పంపిణీ చేశాయని బ్యాంక్‌ల ఆడిట్‌ రిపోర్టుల్లో తేలింది. పలు లావాదేవీలు భూమి, ఆస్తుల్లో పెట్టుబడుల రూపంలో ఉన్నాయని వెల్లడించాయి.