
కరీంనగర్ : సార్.. బావిలో పిల్లి పడింది.. రక్షించండి.. ప్లీజ్.. అంటూ అర్థరాత్రి 12 గంటల సమయంలో పోలీస్ బాస్కు కాల్ వచ్చింది. వెంటనే అప్రమత్తమైన పోలీసు సిబ్బంది ఆ పిల్లిని రక్షించారు. బతుకు జీవుడా.. అంటూ ఆ పిల్లి లటుక్కున పారిపోయింది..! ఈ ఘటన కరీంనగర్ జిల్లా కేంద్రంలో ఆదివారం అర్ధరాత్రి జరిగింది.
ఏం జరిగిందంటే ....
స్థానిక విద్యానగర్లోని కేడీసీసీ బ్యాంక్ వద్ద నివాసముంటున్న మనోహర్ ఇంటి వెనుక ఎవరూ ఉపయోగించని చేదబావి ఉంది. ఇంటి పరిసరాల్లో తిరిగే రెండు పిల్లులు గత ఆదివారం సాయంత్రం 5.30 గంటల సమయంలో పోట్లాడుకున్నాయి. ఆ పోట్లాటలో ఒక పిల్లి బావిలో పడిపోయింది. అక్కడే ఉన్న మనోహర్ కుమార్తె స్నితిక (10వ తరగతి) గమనించి తన తండ్రికి చెప్పింది. వారిద్దరూ గూగుల్లో జంతు సంరక్షణ సిబ్బందిని ఆశ్రయించారు. వారి సూచనల ప్రకారం... థర్మాకోల్ షీట్ను బావిలో వేసి పిల్లిని పైకి తీసుకొచ్చేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు. జంతువుల సంరక్షణ సిబ్బంది సూచనతో అర్ధరాత్రి మనోహర్ కరీంనగర్ పోలీస్ కమిషనర్ వి.సత్యనారాయణ, అగ్నిమాపక సిబ్బందికి ఫోన్ చేశారు. స్పందించిన సీపీ ఏసీపీ తుల శ్రీనివాస్రావును పురమాయించారు. అర్ధరాత్రి 12.30 గంటలకు జాలి గంపను బావిలోకి పంపి పిల్లిని సురక్షితంగా బయటకు తీశారు. మొత్తానికి ఆ పిల్లి బావిలో నుండి ప్రాణాలతో బయటపడి పరుగులంకించుకుంది.