Mar 30,2023 21:45

- పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చ
- ముగిసిన సమావేశాలు
ప్రజాశక్తి-ఎంవిపి కాలనీ, విశాఖ :
రెండవ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ (ఐడబ్ల్యుజి) సమావేశంలో భాగంగా ఇండియన్‌ జి-20 ప్రెసిడెన్సీ, ఆసియా డెవలప్‌మెంట్‌ బ్యాంక్‌ సంయుక్తంగా గురువారం జి-20 ప్రతినిధుల కోసం కెపాసిటీ బిల్డింగ్‌ వర్క్‌షాప్‌ నిర్వహించాయి. ఈ వర్క్‌షాప్‌లో పట్టణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఫైనాన్సింగ్‌కు సంబంధించి అంతర్జాతీయ ఉత్తమ పద్ధతులను, స్థానిక ప్రభుత్వాలకు సమ్మిళిత, స్థితిస్థాపకత, స్థిరమైన నగరాల కోసం అర్బన్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌కు ఫైనాన్స్‌ చేయడానికి అవసరమైన సామర్థ్యాలపై చర్చించారు. సమావేశంలో నగరాలకు ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫైనాన్సింగ్‌ను పెంపొందించడానికి తమ దేశాల్లో అవలంభిస్తోన్న ఉత్తమ పద్ధతులను సింగపూర్‌, దక్షిణ కొరియా, రష్యా, చైనా, యూరోపియన్‌ కమిషన్‌, భారతదేశానికి చెందిన నిపుణులు వివరించారు. సింగపూర్‌ సూత్రాలు, సమ్మిళిత, స్థితిస్థాపకమైన, స్థిరమైన నగరాలను నిర్మించడానికి వ్యూహాలను సింగపూర్‌లోని నేషనల్‌ ఎన్విరాన్‌మెంటల్‌ ఏజెన్సీ మాజీ డిప్యూటీ చీఫ్‌ ఎగ్జిక్యూటివ్‌ ఆఫీసర్‌ డైరెక్టర్‌ జనరల్‌ అV్‌ా తువాన్‌ లోV్‌ా వివరిచారు. ఇందులో డైనమిక్‌ అర్బన్‌ గవర్నెన్స్‌ సిస్టమ్‌తో ఇంటిగ్రేటెడ్‌ మాస్టర్‌ ప్లానింగ్‌, అభివృద్ధి, వ్యర్థాలు - నీటి నిర్వహణ, పర్యావరణ పర్యవేక్షణ, విద్య అంశాలు ఉన్నాయి. అనంతరం దక్షిణకొరియా ప్రతినిధులు ఇన్హీ కిమ్‌, హురుషిన్‌లు సియోల్‌ నగరం ఎదుర్కొన్న నిర్దిష్ట సవాళ్లను, తగ్గించడానికి అనుసరించిన వివిధ పునరాభివృద్ధి, పునరుద్ధరణ చర్యలను వివరించారు. చైనా, రష్యా, యూరోపియన్‌ కమిషన్‌, భారతదేశం నుంచి వచ్చిన ప్రతినిధులు పట్టణ మౌలిక సదుపాయాలకు ఫైనాన్సింగ్‌ను పెంచడానికి అనుసరించిన వివిధ చర్యలపై కేస్‌ స్టడీస్‌ను సమర్పించారు. స్మార్ట్‌ వాటర్‌ మేనేజ్‌మెంట్‌తో స్థిరమైన, సమ్మిళిత నీటి సరఫరా మెరుగుదలపై సభలో ప్రదర్శించారు. సరస్సు పునరుజ్జీవనానికి సంబంధించి ముదర్సలోవా సరస్సును, పటిష్టమైన వాతావరణ స్థితిస్థాపకత కోసం 2 ఎండబ్ల్యు ఫ్లోటింగ్‌ సోలార్‌ను ప్రదర్శించడానికి, సమర్థవంతమైన ఘన వ్యర్థాల నిర్వహణ కోసం ప్రయివేట్‌ రంగ భాగస్వామ్యాన్ని హైలైట్‌ చేయడానికి, జిందాల్‌ వేస్ట్‌ నుంచి ఎనర్జీ ప్లాంట్‌ వరకు మూడు విజయవంతమైన ప్రాజెక్టులను సభలో ప్రదర్శించారు. సమావేశంలో 2023 ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఎజెండా కింద జరుగుతున్న చర్చలను పూర్తి చేసేందుకు ప్రాక్టికల్‌ లెర్నింగ్‌ను ప్రారంభించేందుకు భారత అధ్యక్ష కార్యాలయం చేస్తున్న ప్రయత్నాన్ని జి -20 ప్రతినిధులు అభినందించారు. ఈ వర్క్‌షాప్‌తో విశాఖపట్నంలో రెండు రోజుల ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ వర్కింగ్‌ గ్రూప్‌ సమావేశాలను విజయవంతంగా ముగిశాయి. తదుపరి సమావేశం 2023 జూన్‌ 26, 27, 28 తేదీల్లో ఉత్తరాఖండ్‌లోని రిషికేశ్‌లో జరగనున్నాయి.