May 25,2023 22:05

ఇంగ్లండ్‌ : ప్రపంచ టెస్టు ఛాంపియన్‌షిప్‌ జూన్‌ 7న మొదలనుకానున్నది. టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ కోసం భారత్‌ - ఆస్ట్రేలియా జట్లు పోటీపడుతున్నాయి. ఇంగ్లండ్‌లోని ఓవల్‌లో మ్యాచ్‌ జరుగనున్నది. ఈ మ్యాచ్‌ కోసం టీమిండియా క్రికెటర్లు పలువురు ముందస్తుగానే ఇంగ్లండ్‌కు చేరుకొని.. ట్రైనింగ్‌ను ప్రారంభించారు. గురువారం ప్రాక్టీస్‌ సెషన్‌కు సంబంధించిన ఫొటోలను బీసీసీఐ షేర్‌ చేసింది. ప్రధాన కోచ్‌ రాహుల్‌ ద్రవిడ్‌తో పాటు బ్యాటింగ్‌ కోచ్‌ విక్రమ్‌ రాథోడ్‌, బౌలింగ్‌ కోచ్‌ పరాస్‌ మాబ్రే ఉన్నారు.
క్రికెటర్లు, కోచింగ్‌ స్టాఫ్‌ కొత్త కిట్లతో మెరిశారు. బీసీసీఐ ఇటీవల అడిడాస్‌తో ఒప్పందం చేసుకున్నది. క్రికెటర్లతో పాటు స్టాఫ్‌ కొత్త కిట్లతో పాటు జెర్సీపై లోగో కనిపించనున్నది. మరో ప్రస్తుతం ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ కొనసాగుతున్నది. టోర్నీ ముగిసేందుకు మరో రెండు మ్యాచ్‌లు మిగిలాయి. శుక్రవారం క్యాలిఫయర్‌-1 జరునుండగా.. 28న ఫైనల్‌ మ్యాచ్‌ జరుగనున్నది. ఈ నెల 21తో లీగ్‌ మ్యాచ్‌లు ముగిశాయి. దాంతో ప్లే ఆఫ్‌ చేరుకొని.. టెస్టు జట్టు సభ్యులు ఇంగ్లండ్‌కు బయలుదేరారు. కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్టుకు చెందిన ఉమేశ్‌ యాదవ్‌, శార్దూల్‌ ఠాకూర్‌తో పాటు అక్షర్‌ పటేల్‌ మరికొందరు మంగళవారమే ఇంగ్లండ్‌కు బయలుదేరారు.
మాజీ కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ బుధవారం ఇంగ్లండ్‌ విమానమెక్కాడు. కెప్టెన్‌ రోహిత్‌తో పాటు మరికొందరు ఆటగాళ్లు ఐపీఎల్‌ పూర్తయ్యాక టెస్టు చాంపియన్‌ షిప్‌ కోసం ఇంగ్లండ్‌కు వెళ్లనున్నారు. ఇదిలా ఉండగా.. ఇంతకు ముందు టీమిండియా 2021లో ప్రపంచ టెస్ట్‌ చాంపియన్‌షిప్‌ ఫైనల్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమిపాలైంది. వరుసగా రెండోసారి ఫైనల్‌కు చేరగా.. ఈ సారి టైటిల్‌ను కైవసం చేసుకోవాలనే పట్టుదలతో ఉన్నది. భారత్‌ చివరి సారిగా 2013 జూన్‌లో ఐసీసీ ట్రోఫీని గెలుచుకున్నది. దాదాపు పదేళ్ల తర్వాత మరోసారి చాంపియన్‌షిప్‌ను కైవసం చేసుకునేందుకు ఉవ్విళ్లూరుతున్నది.