Sep 22,2022 21:06
  • డాలర్‌ @ 80.86
  • ఆల్‌టైం కనిష్టానికి పతనం
  • దిగుమతులు మరింత భారం
  • 82కు పడిపోవచ్చు..!

ప్రజాశక్తి - బిజినెస్‌ డెస్క్‌ : అంతర్జాతీయ ద్రవ్య మార్కెట్‌లో రూపాయి విలువ వెలవెల పోతోంది. చరిత్రలోనే ఇది వరకూ ఎప్పుడూ లేని స్థాయిలో పతనమయ్యింది. అమెరికా ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్ల పెంపునకు తోడు పలు దేశీయ కారణాలతో గురువారం రూపాయి విలువ ఓ దశలో దాదాపు 1.24 శాతం మేర నష్టపోయింది. తుదకు డాలరుతో పోలిస్తే 89 పైసలు క్షీణించి 80.86కు పతనమయ్యింది. ఇది రూపాయి చరిత్రలోనే అతిపెద్ద పతనం. ఈ ఏడాది ఫిబ్రవరి 24 తర్వాత ఒకే రోజు ఇంత విలువ కోల్పోవడం కూడా ఇదే తొలిసారి. బుధవారం సెషన్‌లో 79.97 వద్ద ముగిసింది.
రూపాయి విలువ పటిష్టానికి ఆర్‌బిఐ తీసుకున్న చర్యలు బలియంగా లేవని పలువురు ట్రేడర్లు రాయిటర్స్‌తో పేర్కొన్నారు. ఫెడరల్‌ రిజర్వు వడ్డీరేట్లను మరో 75 పాయింట్లు పెంచుతున్నట్లు ఛైర్మన్‌ జెరోమ్‌ పావెల్‌ ప్రకటించారు. ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయడానికి మున్ముందు రేట్ల పెంపు విషయంలో మరింత కఠినంగా వ్యవహరిస్తామని పావెల్‌ పేర్కొన్నారు. అమెరికాలో వడ్డీరేట్లు పెరిగినప్పుడు దేశీయ మార్కెట్ల నుంచి మదుపర్లు తమ పెట్టుబడుల్ని ఉపసంహరించుకుంటారు. అధిక రాబడి కోసం వాటిని అమెరికాకు తరలిస్తారు. ఫలితంగా డాలర్‌కు డిమాండ్‌ పెరిగి బలపడుతుంది. ఈ క్రమంలోనే డాలర్‌ విలువ రెండేళ్ల గరిష్ట స్థాయికి చేరింది. ఇది రూపాయిపై ఒత్తిడిని పెంచుతోంది. ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపునతో డాలర్‌ బలపడడం, భారత ఈక్విటీ మార్కెట్లలో ఒత్తిడి, చమురు ధరలు స్తబ్ధుగా ఉండడం, దేశ వాణిజ్య లోటు పెరగడం తదితర పరిణామాలు రూపాయి విలువను అగాథంలో పడేశాయి.
దేశానికి ప్రమాదం..
రూపాయి రికార్డ్‌ పతనం భారతీయులందరిపై ప్రత్యక్ష్యంగా.. పరోక్షంగా తీవ్ర ప్రభావం చూపనుంది. దిగుమతులు భారం అవుతాయి. దేశంలో చమురు, ఎలక్ట్రానిక్స్‌ తదితర దిగుమతి ఉత్పత్తుల ధరలు పెరుగుతాయి. అనేక ముడి సరుకుల ధరలకు రెక్కలు రావడంతో ద్రవ్యోల్బణానికి ఆజ్యం పోస్తాయి. విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించే భారత విద్యార్థుల కుటుంబాలపై అధిక భారం పడుతుంది. భవిష్యత్తు రోజుల్లో ఇది మరింత క్షీణించొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. మధ్యస్థ కాలానికి డాలర్‌తో రూపాయి మారకం విలువ 81-82కు పడిపోయే అవకాశాలు మెండుగా ఉన్నాయని విశ్లేషిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వ అనాలోచిత ఆర్థిక విధానాలతో దేశంలో ఇప్పటికే అధిక ధరలు బెంబేలెత్తిస్తున్న తరుణంలో కరెన్సీ క్షీణత ద్రవ్యోల్బణానికి మరింత ఆజ్యం పోయనుంది. ప్రజల ఆదాయం పడిపోనుంది. వస్తువులకు డిమాండ్‌ తగ్గనుంది.. అంతిమంగా ఇది తీవ్ర ఆర్థిక సంక్షోభానికి దారి తీయనుంది.