Mar 18,2023 09:53

బిహార్‌ : బెయిల్‌ కోసం నాలుగేళ్ల బాలుడు కోర్టును ఆశ్రయించిన ఘటన బిహార్‌లోని బెగుసరారు జిల్లాలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం.. 2021 ఏప్రిల్‌లో రెండేళ్ల వయసున్న ఆ బాలుడు సహా 8 మంది కంటైన్‌మెంట్‌ ప్రాంతంలో పెట్టిన బారికేడ్లు తొలగించడం ద్వారా కొవిడ్‌ వ్యాప్తికి కారణమయ్యారని పోలీసులు కేసు నమోదు చేశారు. ఆ బాలుడి తల్లికి ఈ కేసు విషయం గురువారమే తెలిసింది. దీంతో బెయిల్‌ కోసం తన కుమారుణ్ని వెంటబెట్టుకుని కోర్టుకు వచ్చింది. ఈ కేసును విచారించిన బెగుసరారు కోర్టు విస్మయం వ్యక్తం చేసింది. చిన్నారిపై ఇలాంటి కేసు పెట్టడానికి, బెయిల్‌ ఇవ్వడానికి ఎటువంటి నిబంధనలు లేవని తెలిపింది. బాలుడిపై కేసు కొట్టివేయాలని పోలీసులను ఆదేశించింది.