Jan 30,2023 21:18

భువనేశ్వర్‌: భారత హాకీ జట్టు కోచ్‌ గ్రాహం రీడ్‌ రాజీనామా చేశారు. రీడ్‌ తన రాజీనామాను హాకీ ఇండియా(హెచ్‌ఐ) అధ్యక్షుడు దిలీప్‌ టిర్కేకు సోమవారం సమర్పించారు. నా బాధ్యతల నుంచి తప్పుకోవాల్సిన సమయం వచ్చిందని అనిపిస్తోందని, భారత హాకీ జట్టుకి హెడ్‌ కోచ్‌గా వ్యవహరించడాన్ని నాకు దక్కిన గౌరవంగా భావిస్తున్నాను. ఈ ప్రయాణంలో ప్రతి మ్యాచ్‌ని ఎంతగానో ఎంజారు చేశానని, భారత హాకీ జట్టు మున్ముందు మరిన్ని గొప్ప విజయాలు అందుకోవాలని కోరుకుంటున్నానంటూ రీడ్‌ లేఖలో పేర్కొన్నాడు. రీడ్‌తో పాటు కోచ్‌ గ్రెగ్‌ క్లార్క్‌, సైంటిఫిక్‌ అడ్వైజర్‌ మిచెల్‌ డేవిడ్‌ పెంబర్టన్‌ సైతం తమ పదవులకు రాజీనామా చేశారు. ఇటీవల ఒడిశా వేదికగా జరిగిన హాకీ వరల్డ్‌ కప్‌లో భారత జట్టు తొమ్మిదో స్థానంలో నిలిచింది. రీడ్‌ పర్యవేక్షణలో టీమిండియా 2021 టోక్యో ఒలింపిక్స్‌లో కాంస్య పతకాన్ని కైవసం చేసుకొని దాదాపు 40 ఏళ్ల తర్వాత సుదీర్ఘ నిరీక్షణకు తెర దించిన సంగతి తెలిసిందే.