
కమల్ హాసన్ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న 'ఇండియన్ 2' చిత్రంలో హీరోయిన్ కాజల్ మళ్లీ వెండితెరపై కనిపించబోతున్నారు. తాజాగా ఈ విషయాన్ని ఆమె స్వయంగా తన ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించారు. 1996లో వచ్చిన 'ఇండియన్' (భారతీయుడు)కు సీక్వెల్గా 'ఇండియన్ 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు శంకర్ దర్శకత్వం వహిస్తున్నారు. 60 శాతం షూటింగ్ పూర్తయిన ఈ ప్రాజెక్టు సెట్స్లో జరిగిన ప్రమాదంలో ముగ్గురు టెక్నీషియన్లు మరణించడం, దర్శక నిర్మాతల మధ్య వచ్చిన భేదాభిప్రాయాల వల్ల నిలిచిపోయింది. తర్వాత ఇరువురి మధ్య రాజీ కుదరడంతో 'ఇండియన్ 2'ను మొదలుపెట్టేందుకు చిత్రబృందం సిద్ధమౌతోంది. అయితే ఇటీవల కాజల్ అగర్వాల్ ఈ సినిమా నుంచి తప్పుకున్నట్టుగా వార్తలు వచ్చాయి. దీనిపై ఆమె తాజాగా తన ఇన్స్టాగ్రామ్ లైవ్ ఛాట్లో స్పష్టత ఇచ్చారు. హీరోయిన్ నేహా ధూపియాతో మాట్లాడుతూ.. సెప్టెంబర్ 13 నుంచి 'ఇండియన్ 2' షూటింగ్ మొదలు పెడుతున్నట్టు కాజల్ తెలిపారు.