Jun 22,2022 21:23

న్యూఢిల్లీ: 'ఖేలో చెస్‌' యువతకు సువర్ణావకాశమని ఆలిండియా చెస్‌ ఫెడరేషన్‌ సెక్రటరీ భగత్‌ సింగ్‌ చౌహాన్‌ అన్నారు. జులైాఆగస్టులో 'ఖేలో చెస్‌'ను దిగ్విజయంగా నిర్వహిస్తామన్నారు. ఈ క్రీడకు సంబంధించిన టార్చ్‌ రిలేను ప్రధాని నరేంద్ర మోడీ ఇటీవలే ఇందిరాగాంధీ ఇండోర్‌ స్టేడియంలో ప్రారంభించిన సంగతి తెలిసిందే. యువత ఈ క్రీడను ఒక ఉపాధిగా ఎంచుకొనేందుకు దోహదపడుతుందని చౌహాన్‌ తెలిపారు. ఖేలో చెస్‌ను నిర్వహించడం ద్వారా యువ తమ ప్రతిభను నిరూపించుకొనేందుకు చక్కని అవకాశంగా ఉపయోగపడుతుందన్నారు. ఈ వేదిక ద్వారా యువతలో ఉన్న ప్రతిభ వెలుగులోకి వచ్చే అవకాశముందని, ఔత్సాహికులకు ఇది ఒక సువర్ణావకాశమని చెప్పుకొచ్చారు. ఇప్పుడిప్పుడే భారత్‌నుంచి యువ గ్రాండ్‌మాస్టర్లు తయారవుతున్నారని, వీరిలాగే మరింతమంది తమ సత్తాను నిరూపించుకొనేందుకు ఇది చక్కని అవకాశమన్నారు. ఖేలో ఇండియాను కేంద్ర ప్రభుత్వం 2018లో ప్రారంభించిన సంగతి తెలిసిందే.