Mar 18,2023 06:30

పెట్టుబడిదారీ వ్యవస్థలో రోజురోజుకు తీవ్రమౌతున్న సంక్షోభాలు, గతంలో ఎన్నడూ లేని విధంగా కరోనా మహమ్మారి విస్తరణ, ప్రపంచం గత ఎనిమిది దశాబ్దాలలో ఎరుగని వరుస రెండవ మాంద్యం...వంటి అంశాలు నయా ఉదారవాద నమూనా యొక్క డొల్లతనాన్ని, అనాగరికతను బహిర్గతం చేశాయి. పెరుగుతున్న అసమానతలు, నిరుద్యోగం, పేదరికం, ఆకలి, మెజారిటీ ప్రజలు ఎదుర్కొంటున్న వ్యాధుల పట్ల పాలక పక్షాలు తీవ్రమైన ఉదాసీనతతో కూడిన వైఖరిని అవలంభించాయి. ఇదే సమయంలో, మహమ్మారి వలన ఏర్పడిన అత్యంత వినాశకర పరిస్థితిలో కూడా అతి కొద్దిమందిగా ఉన్న కార్పోరేట్‌ కుబేరులకు గరిష్టంగా లాభాలు సమకూర్చే పనిలో నిమగమైంది. మహమ్మారి వ్యాపించిన గత రెండు సంవత్సరాల కాలంలో ప్రపంచ జనాభాలో 99 శాతం ప్రజలందరి రెండు రెట్ల సంపదను ప్రపంచంలోని 1 శాతం ధనవంతులు పోగు చేసుకున్నారు. భారత దేశంలోని ప్రజలు అప్పులతో, పేదరికం, నిరుద్యోగం, ఆకలితో కొట్టుమిట్టాడుతున్న సమయంలో, బిజెపి ప్రభుత్వానికి అనుకూలమైన ఆప్తమిత్రులు సంపదను కూడబెట్టుకోవడాన్ని చూస్తున్నాం. భారత దేశంలోని 40 శాతానికి పైగా సంపద జనాభాలో 1 శాతం వద్ద ఉన్నది. భారత దేశంలోని బిలియనీర్ల సంఖ్య 2021లో 102 నుండి 166కు పెరిగింది. దీనికి భిన్నంగా, ప్రపంచంలోనే అత్యధికంగా, 23 కోట్ల మంది భారత ప్రజలు పేదరికంలో నివసిస్తున్నారు. అత్యంత దారుణమైన తిరోగమనంతో కూడిన అనాగరిక చర్య ఏమంటే లాక్‌డౌన్‌ సమయంలో వలస కార్మికులు తాము వున్న ప్రదేశం నుండి ఒకేసారి సామూహిక వలసలు చేపట్టవలసిరావడం, ఆక్సిజన్‌తో పాటు, కనీస ఆరోగ్య వసతుల కొరత వల్ల గంగానదిలో శవాలు తేలడం. అదే సమయంలో కార్పొరేట్‌, మతతత్వ పాలకులు 'పి.ఎం కేర్స్‌' పేరుతో కోట్ల రూపాయలను పోగు చేసుకున్నారు. ఇదే సందర్భంలో వారి ఆశ్రితులు సహజ వనరులను, ప్రభుత్వ రంగ సంస్థలను ఇతర వనరులను స్వాధీనం చేసుకొని, సంపదలను కూడబెట్టుకున్నారు. గత ఎనిమిదేళ్ల మోడీ బిజెపి పాలనను గమనించినట్లయితే, గతంలో ఎన్నడూ ఎరుగని విధంగా రైతాంగం, వ్యవసాయ కార్మికులు, రోజువారీ కూలీలు, నిరుద్యోగ యువతతో పాటు భారీ సంఖ్యలో నాలుగు లక్షల పైగా ప్రజలు నిస్పృహతో ఆత్మహత్యలు చేసుకున్నారు. వ్యవసాయ సంక్షోభం తీవ్రమై ప్రజలు, రైతాంగం పేదరికంలోకి నెట్టివేయబడటమే కాక, తమ ఉపాధికి అవసరమైన కనీస వనరులను కోల్పోయారు. ఈ దుర్భర పరిస్థితి నుండి దృష్టి మళ్లించేందుకు మతపరమైన విభజనలను సృష్టిస్తున్నారు. అల్ప సంఖ్యాక వర్గాలపై, బలహీన వర్గాలపై దాడులు చేస్తున్నారు. నయా ఉదారవాద విధానాలను నిరోధించేందుకు ప్రపంచవ్యాప్తంగా కార్మిక వర్గం, రైతాంగం సుదీర్ఘ పోరాటాలు నిర్వహించాయి. భారతదేశంలో కూడా సామూహిక ప్రజా పోరాటాలను నిర్వహించి చారిత్రికమైన విజయాలను సాధించాయి. తద్వారా నిరంకుశ ప్రభుత్వం తన విధానాలను, అనివార్యంగా వెనక్కి తీసుకునేట్లు చేయగలిగాయి.
ఈ ఎనిమిది సంవత్సరాల కాలంలో ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ (ఎఐకెఎస్‌) స్వతంత్రంగా పోరాటాలు నిర్వహించి, నూతన ప్రాంతాలకు విస్తరించింది. ఎఐకెఎస్‌ నవంబర్‌ 2016లో స్వతంత్రంగా నిర్వహించిన కిసాన్‌ సంఘర్ష్‌ జాతా, కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ, నరేంద్ర మోడీ వినాశకర నోట్ల రద్దుకు వ్యతిరేకంగా నిర్వహించబడిన మొట్టమొదటి అఖిల భారత నిరసన కార్యక్రమం. రాజస్థాన్‌ రైతాంగం నిర్వహించిన పోరాటాలు, నాసిక్‌ నుండి ముంబాయి వరకు రైతులు నిర్వహించిన కిసాన్‌ లాంగ్‌ మార్చ్‌ బిజెపి ప్రభుత్వాలను ఓడించి, అనివార్యంగా డిమాండ్లను అంగీకరించేట్లు చేసింది. ఆవిధంగా బిజెపి ప్రభుత్వ మెడ వంచవచ్చన్న స్పష్టమైన సందేశాన్నిచ్చింది. ఈ పోరాటాలు ప్రజల అవగాహనా శక్తిని పెంచడమే కాక, వారిలో విశ్వాసాన్ని పెంపొందించాయి. ఆల్‌ఇండియా కిసాన్‌ సభ, సమస్యల ప్రాతిపదికన ఐక్యతను, ఐక్య పోరాటాలను నిర్మించడంలో చొరవ చూపింది. నరేంద్ర మోడీ బిజెపి ప్రభుత్వ అనాగరిక భూమి సేకరణ ఆర్డినెన్సును వెనక్కు తీసుకోవడంలో భూమి అధికార్‌ ఆందోళన్‌ అవిశ్రాంత పోరాటాలు ప్రధాన పాత్ర పోషించాయి. ఐక్య పోరాటం ద్వారా నిరంకుశ, కార్పోరేట్‌, మతతత్వ ప్రభుత్వానికి మొట్టమొదటి అపజయాన్ని అందించాయి. ఆల్‌ ఇండియా కిసాన్‌ కోఆర్డినేషన్‌ సంఘర్ష్‌ సమితి, సమస్యల ప్రాతిపదికన ఆల్‌ ఇండియా కిసాన్‌ సభతో పాటు, 250 రైతు సంస్థలు... గిట్టుబాటు ధరల కోసం, అప్పుల బారి నుండి విముక్తి కోసం, భారీ ఎత్తున సమీకరణలు నిర్మించడంలో ముఖ్యమైన పాత్రను పోషించాయి. కేంద్ర కార్మిక సంఘాలు సైతం ఐక్య పోరాటాలను నిర్వహించడం ఈ విషయంలో చెప్పుకోదగిన అంశం. ఆల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో వ్యవసాయ కార్మిక సంఘాలు ఐక్య పోరాటాలు నిర్వహించాయి.
కార్పోరేట్‌ అనుకూల, మతతత్వ, నయా ఉదారవాద విధానాలను అనుసరిస్తున్న ప్రభుత్వాన్ని పోరాటాలతో కట్టడి చేయడానికి కార్మిక వర్గం, రైతాంగం చైతన్యవంతమైన ఐక్య ఉద్యమాలను నిర్మించాయి. ఆల్‌ ఇండియా కిసాన్‌ సభ, సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్స్‌, ఆల్‌ ఇండియా వ్యవసాయ కార్మిక సంఘాల ఒక దశాబ్ద కాలపు నిరంతర కృషి, ఐక్యత ద్వారా ఇది సాధ్యమైంది.
2018లో కార్పొరేట్‌ మీడియా ఎర్రజెండా మీద కారు కూతలు కూస్తున్న, రాస్తున్న సమయంలో ఎఐకెఎస్‌, సెంటర్‌ ఆఫ్‌ ఇండియన్‌ ట్రేడ్‌ యూనియన్‌, అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం నాయకత్వంలో అత్యంత సమరశీల పోరాటాలు జరిగాయి. ఆగస్టు 9న క్విట్‌ ఇండియా దినోత్సవం సందర్భంగా ఉధృత ప్రచారంతో పాటు స్వచ్ఛందంగా కోర్టు అరెస్టులకు సిద్ధపడటం, జైల్‌ భరో కార్యక్రమాలు నిర్వహించాయి. దేశవ్యాప్తంగా ఐదు లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో భాగస్వాములయ్యారు. సెప్టెంబర్‌ 5న, కార్మిక, కర్షక ఐక్యతను బలపరుస్తూ మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ప్రదర్శన జరిగింది. ఈ నిరంతర పోరాటాలు మోడీ నాయకత్వంలోని నిరంకుశ, కార్పొరేట్‌, మతోన్మాద బిజెపి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఒక వాతావరణాన్ని సృష్టించాయి. కరోనా మహమ్మారి వ్యాపించి ప్రపంచమంతా వ్యాధితో పోరాడుతున్న లాక్‌డౌన్‌ కాలంలో అన్నిచోట్ల భయంతో కూడిన వాతావరణం నెలకొంది. లాక్‌డౌన్‌ విధించిన నెల రోజుల లోపే ఈ మూడు సంఘాల చొరవతో ఆర్థిక సహకారం కోసం, ఆహార భద్రత, గ్రామీణ ఉపాధి చట్టం ప్రకారం ఉపాధి, నిరుద్యోగ వేతనాలు, సార్వత్రిక వైద్య, ఆరోగ్య సౌకర్యాలు, సామాజిక భద్రతల కోసం డిమాండ్‌ చేస్తూ కార్మిక వర్గం ముందుకు వచ్చింది.
అయితే, బిజెపి ప్రభుత్వం రైతాంగంపై, కార్మిక వర్గంపై దాడులు చేస్తూ తన కార్పోరేట్‌ మిత్రులకు మాత్రం భారీ ఎత్తున రాయితీలు ఇచ్చింది. భారత వ్యవసాయ రంగాన్ని కార్పోరేట్‌ రంగానికి అప్పగించే లక్ష్యంతో మూడు కార్పోరేట్‌ అనుకూలమైన రైతు చట్టాలను రూపొందించింది. అంతేగాక కార్మికవర్గం కష్టపడి సాధించుకున్న హక్కులను గుంజుకొనే లేబర్‌ కోడ్లు, అంతులేని లాభాలను పెంచే లక్ష్యంతో, హద్దులు లేని దోపిడీ విధానాలను అప్రజాస్వామిక పద్ధతుల్లో తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. ఇది మన రాజ్యాంగ పరమైన, సమాఖ్య విధానాన్నే దెబ్బతీసింది. ఈ చర్యలను కార్మికులు, రైతాంగం తమ శక్తివంచన లేకుండా ప్రతిఘటించాయి. 2020 నవంబర్‌ 26న కేంద్ర కార్మిక సంఘాలు దేశవ్యాప్తంగా సార్వత్రిక సమ్మెకు పిలుపునివ్వగా, రైతు సమస్యల ఆధారిత ఐక్యతా సంస్థ, సంయుక్త కిసాన్‌ మోర్చాలు గ్రామీణ భారత హర్తాళ్‌కు పిలుపునిచ్చాయి. దేశ రాజధానికి పొరుగున ఉన్న రాష్ట్రాలు చలో ఢిల్లీకి పిలుపునిచ్చాయి. 380 రోజులు పాటు సాగిన ఈ ఉద్యమం వ్యవసాయ కార్మిక సంఘం, కార్మిక వర్గం యొక్క చురుకైన భాగస్వామ్యంతో సాగింది. 750 మంది రైతుల బలిదానంతో, బిజెపి ప్రభుత్వం రైతాంగానికి క్షమాపణలు చెప్పి చట్టాలను వెనక్కు తీసుకునేలా చేసింది. ఈ ప్రతిఘటన నేపథ్యంలో లేబర్‌ కోడ్లను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైంది. ఈ విజయం సాధించడానికి సంయుక్త కిసాన్‌ మోర్చా కేంద్ర కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణల మధ్య సమన్వయమే ప్రధాన కారణం. విద్యుత్‌ సవరణల ఉపసంహరణ కూడా ఎస్‌కెయం, కార్మిక వర్గాల పోరాటాల డిమాండ్‌ ఫలితమేనని గమనించాలి. విశాఖపట్నంలోని ఉక్కు ఫ్యాక్టరీ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా జరిగిన పోరాటానికి రైతాంగ మద్దతు చెప్పుకోదగినది. మహారాష్ట్ర లోని విద్యుత్‌ పంపిణీ సంస్థలను ప్రైవేటు పరం చేయటానికి, అదానీలకు అప్పగించడానికి చేసిన ప్రయత్నాలను విద్యుత్‌ రంగ కార్మిక వర్గం ఓడించింది.
కార్మికులు, కర్షకులు కష్టపడి సాధించుకున్న హక్కుల పరిరక్షణను వక్కాణిస్తూ 2023 ఏప్రిల్‌ 5న ఢిల్లీలో మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ నిర్వహించాలన్న నిర్ణయం జరిగింది. నిరంకుశ కార్పొరేట్‌, మతోన్మాద, బిజెపి ప్రభుత్వ వ్యతిరేక పోరాటమే ఈ కార్యక్రమ ప్రధాన లక్ష్యం. 2023వ సంవత్సరం కీలకమైంది కావడంతో వర్గ సమస్యలను దేశ ఎజెండాలో ఉంచేందుకు, ప్రజానుకూల ప్రత్యామ్నాయ వాతావరణం నెలకొల్పేందుకు అవసరమయ్యే నిరంతర నిరసనల ప్రారంభానికి ఈ ర్యాలీ ఒక సూచిక. కార్మిక, కర్షక పోరాటాల్లో ఇదొక అతి పెద్ద పోరాటంగా గుర్తించబడాలంటే లక్షల సంఖ్యలో ప్రజాసమీకరణ జరగాలి. దేశంలోని మారుమూల ప్రాంతాల్లోని ప్రజలకు ఈ పోరాట సందేశం చేరవేయాలి. ఇంటింటి ప్రచారం ద్వారా కార్మికులు, కర్షకులు, కష్టజీవులను చేరుకోవాలి. శ్రేయోభిలాషులను సమీకరించేందుకు ఉధృతంగా ఉమ్మడి ప్రచారం జరగాలి.
ఏప్రిల్‌ 5న జరగబోయే మజ్దూర్‌ కిసాన్‌ సంఘర్ష్‌ ర్యాలీ...సి2 + 50 శాతం కనీస మద్దతు ధరకు హామీ, నెలకు కనీస వేతనం రూ. 26,000, గ్రామీణ ఉపాధి చట్టం కింద రోజుకు రూ.600 తగ్గకుండా 200 పని దినాలు, ఆహార భద్రత, విద్యుత్‌ చట్ట సవరణల ఉపసంహరణ, సామాజిక భద్రత, పెన్షన్ల వంటి అంశాలతోపాటు రైతులు, కార్మికులు నిత్యం ఎదుర్కొంటున్న సమస్యలను లేవనెత్తుతుంది. రాష్ట్రాల ఫెడరల్‌ హక్కులు, ప్రజల ప్రజాస్వామిక హక్కుల పరిరక్షణ కోసం, హిందూత్వ ఫ్యాసిస్టు శక్తులకు వ్యతిరేకంగా ఒక స్పష్టమైన సందేశం ఇస్తుంది. ఈ ర్యాలీ...నయా ఉదారవాద, కార్పొరేట్‌-మతోన్మాద పాలనకు ఒక రాజకీయ సైద్ధాంతిక సవాల్‌. ప్రజానుకూల ప్రత్యామ్నాయ విధానాల్ని ముందుకు తీసుకుపోయే ఒక ఐక్య కార్యాచరణ. అంతేగాక, ప్రజా శత్రువులకు నిర్ణయాత్మక ఓటమిని అందించేందుకు, ప్రజానుకూల ప్రత్యామ్నాయ విశాల ఐక్యతా నిర్మాణానికి ఈ ర్యాలీ పనిచేస్తుంది.

vijju

 

 

 

 

 

వ్యాసకర్త ఎఐకెఎస్‌ జాతీయ ప్రధాన కార్యదర్శి డా|| విజూకృష్ణన్‌