May 26,2023 08:57

           ఓ వీధిలో పిల్లలంతా కలిసి ఆడుకుంటు న్నారు. ఎండ మాత్రం విపరీతంగా ఉంది. ఆటల గోలలో పడి వేడిని పట్టించుకోలేదు. అందరూ కేకలు వేస్తూ దొంగ-పోలీసు ఆట ఆడుకుంటు న్నారు. కిషోర్‌ ఒక్కసారిగా 'అమ్మా...! అని గట్టిగా అరిచి, పడిపోయాడు. అది చూసిన తన స్నేహితులు, మిగిలిన పిల్లలు భయంతో పరుగులు తీశారు. ఓ పిల్లవాడు దగ్గరలో ఉన్న దుకాణానికి వెళ్ళి పానీయాలు తీసుకొచ్చాడు. ఇంకొకడు తన ఇంట్లోకి వెళ్లి, కుండలో ఉన్న నీళ్లుతీసుకొచ్చాడు. మిగిలిన పిల్లలు దగ్గర్లో ఉన్న ట్యూషన్‌ టీచర్‌ ఇంట్లోకి తీసుకెళ్లారు.
        ఆమె అతన్ని ముఖంపై నీళ్లు చల్లింది. కిషోర్‌ కళ్లు తెరిచి చూశాడు. తనకు తలంతా మైకంగా ఉందని చెప్పాడు. వడదెబ్బ తగిలిందని టీచర్‌కు అర్థమైంది. తడిగా ఉన్న మెత్తటి క్లాత్‌ తీసుకుని ముఖం, కాళ్లు, చేతులు తుడిచింది. గ్లూకోజ్‌ కలిపిన గ్లాసుడు మంచినీళ్లు తాపింది. కొబ్బరినీళ్లు తెప్పించి, తాపించింది. గంట తర్వాత మజ్జిగలో నిమ్మకాయ పిండి, అందులో ఉప్పు, చెక్కర కలిపి ఇచ్చింది. తోటి పిల్లలు కిషోర్‌కు ఏం అయ్యిందో తెలియక టీచర్‌ చేస్తున్న సపర్యలు చూస్తూ ఉండిపోయారు. అప్పుడు టీచర్‌ వారి ముఖాలు చూసి వారి మనసులో ఉన్న అను మానాలు తీర్చాలనుకుంది.
             ''పిల్లలూ! కిషోర్‌కి వడదెబ్బ తగిలింది. విశ్రాంతి తీసుకుంటే తగ్గిపోతుంది. కాకపోతే చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. లేకుంటే చాలా ప్రమాదం జరిగి ఉండేది. ఇలాంటి సమయంలో కూల్‌డ్రింక్స్‌ తాగకూడదు. అసలు ఇంత వేడిలో ఆడుకోకూడదు. బయటకు వెళ్లేటప్పుడు తప్పకుండా తలకు టోపి పెట్టుకోవాలి. మంచినీళ్లు బాగా తాగుతుండాలి. లేకపోతే ఇలాగే కళ్లు తిరిగి పడిపోతారు. ఇక నుంచి మీరు నీడలోనే ఆడుకోండి. ఇంట్లోనే ఓ చోట కూర్చుని బోర్డు గేమ్స్‌ ఆడుకోండి'' అని చెప్పింది. పిల్లలంతా సరే టీచర్‌ అంటూ ఇళ్లకు వెళ్లిపోయారు.

- గిద్దలూరు
సాయి కిషోర్‌,
రాయదుర్గం.