Feb 05,2023 11:15
  •  మిగిలిన ఇద్దరు గన్‌మెన్‌లను రిటర్న్‌ గిఫ్ట్‌గా ఇచ్చేస్తున్నానని వ్యాఖ్య

ప్రజాశక్తి-నెల్లూరు : భద్రతను కుదిస్తూ ఇద్దరు గన్‌మెన్‌లను ప్రభుత్వం ఉపసంహరించడంపై కోటంరెడ్డి ఫైర్‌ అయ్యారు. ఈ సందర్భంగా ఆయన ఆదివారం విలేకరుల సమావేశం నిర్వహించారు. తనకు బెదిరింపులు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వం అదనపు భద్రత కల్పించాల్సింది పోయి నలుగురిలో ఇద్దరు గన్‌మెన్‌లను వెనక్కు పిలిపించుకోవడం ఏమిటని మండిపడ్డారు. దీని వెనుక రాష్ట్ర పెద్దలు ఎవరున్నారో చెప్పాలని డిమాండ్‌ చేశారు. రాష్ట్ర ప్రభుత్వం తనను మానసికంగా ఇబ్బంది పెట్టాలని నిర్ణయించినట్టు ఈ ఘటనతో అర్థం అవుతోందని వ్యాఖ్యానించారు. తన అదనపు గన్‌మెన్‌లను ఉపసంహరించుకున్న ప్రభుత్వానికి రిటర్న్‌ గిఫ్ట్‌ కింద మిగిలిన ఇద్దరు గన్‌మెన్‌లను తిరిగి ఇచ్చేస్తున్నానని కోటం రెడ్డి పేర్కొన్నారు. మనకు బహుమతి వచ్చిన వారికి రిటర్న్‌ గిఫ్ట్‌ ఇవ్వడం కనీస సంస్కారమని అన్నారు. భద్రత తగ్గించినంత మాత్రాన తాను బలహీనపడనని తేల్చి చెప్పారు. శ్రేయాభిలాషులు, రూరల్ నియోజకవర్గ ప్రజలు, కార్యకర్తలే తనుకు రక్షణ అని చెప్పారు.