
ప్రజాశక్తి-చింతూరు : నౌపడా ప్రాంతంలోని పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో ఓ క్యాంపు నుంచి మరో క్యాంపునకు వెళుతున్న సీఆర్పీఎఫ్ బలగాలపై మావోయిస్టులు దాడి చేశారు. ఈ కాల్పుల్లో ముగ్గురు జవాన్లు మృతి చెందగా, మరో ఏడుగురు జవాన్లకు గాయాలయ్యాయి. మృతి చెందిన వారిని ఏఎస్ఐ శిశుపాల్ సింగ్, సిబ్లాల్, ధర్మేంద్ర కుమార్గా ఏఎస్పీ రాజేంద్ర జైస్పాల్ ధ్రువీకరించారు. ఈ కాల్పుల ఘటనతో పటధారా రిజర్వ్ ఫారెస్ట్ ప్రాంతానికి అదనపు బలగాలను తరలించారు. ప్రస్తుతం అక్కడ మావోయిస్టుల కోసం కూంబింగ్ నిర్వహిస్తున్నారు. ఇటీవల కాలంలో ఒడిశాలో నక్సల్స్ ఉనికి చాటుకోవడం కోసమే ఈ దాడి చేసినట్టు భావిస్తున్నారు.