Mar 19,2023 07:45

  • నేడు ఇ.ఎం.ఎస్‌ 25వ వర్ధంతి

రవయ్యో శతాబ్దపు ప్రపంచ యవనికపై ఇంఎంఎస్‌ నంబూద్రిపాద్‌ది విలక్షణ స్థానం. ప్రజా ఉద్యమాలలో అగ్రభాగాన నిలుస్తూ మరోవైపు ఎన్నికలలో ఘన విజయాలు సాధించి భారత రాజకీయాలలో కీలకమైన మలుపునకు కారణమైన యోధుడాయన. ఎన్నికల ద్వారా ముఖ్యమంత్రి పీఠమెక్కిన తొలి కమ్యూనిస్టుగా ఆయనను ప్రపంచం గుర్తుంచుకుంది. కాంగ్రెస్‌ గుత్తాధిపత్యానికి గండికొట్టిన తొలి ముఖ్యమంత్రిగా చరితార్థుడైన ఉద్దండుడు. సిద్ధాంతకర్తగా, పాలనావేత్తగా బహుముఖ ప్రజ్ఞ చాటి కమ్యూనిస్టు ఉద్యమానికి ఊపిరులూదిన అతిరథ మహారథుడు. ఎలంకుళం మనక్కళ్‌ శంకరన్‌ నంబూద్రిపాద్‌ దేశంలో అరవయ్యేళ్లపాటు కమ్యూనిస్టు ఉద్యమానికి జీవనాడిగా నిలిచిన పేరది. సనాతన ఆచార వ్యవహారాలకు కట్టుబడిన సంపన్న భూస్వామ్య కుటుంబంలో పుట్టిన ఇంఎంఎస్‌ అలుపులేని సేవానిరతితో కేరళ ప్రజలకు ప్రియతమ నాయకుడైనాడు. ఇప్పటికీ కేరళలో అరుణ పతాకం రెపరెపలాడుతుందంటే అందుకు ఆయన వేసిన పునాదులు, ఇచ్చిన వారసత్వం కీలక పాత్ర వహిస్తాయి.
        1909 జూన్‌ 13న దక్షిణ మలబార్‌ ప్రాంతంలోని ఎలంకుళం గ్రామంలో ఆయన జన్మించారు. వేద విద్యలను నిష్టగా అభ్యసించిన బాల్యం తనది. సోదరుడితో పాటు 1925లో పాఠశాలకు వెళ్లడం మొదలెట్టాకే ఆయనకు సమాజ స్థితిగతులపై అవగాహన కలిగింది. క్రమంగా సంఘసంస్కరణ, స్వాతంత్రోద్యమాల పట్ల ఆకర్షితులైనారు. 1932లో కళాశాల విద్యకు మధ్యలోనే స్వస్తి చెప్పి జాతీయోద్యమ బాట పట్టారు. ఉప్పు సత్యాగ్రహంలో పాల్గొని జైలు శిక్షననుభవించారు. అక్కడే ఆయనకు కమ్యూనిస్టు ఉద్యమ వ్యవస్థాపకుడైన కృష్ణ పిళ్లై తో పరిచయమేర్పడింది. బెంగాల్‌ విప్లవకారుల సాన్నిహిత్యమూ కలిగింది. కాంగ్రెస్‌లో అంతర్భాగంగా 1934లో కాంగ్రెస్‌ సోషలిష్టు పార్టీ ఆవిర్భవించినప్పుడు నంబూద్రిపాద్‌ దానికి ప్రధాన కార్యదర్శుల్లో ఒకరైనారు. మద్రాసులో కృష్ణ పిళ్లై, సుందరయ్యలతో సుదీర్ఘ చర్చల అనంతరం ఆయన కమ్యూనిస్టు ఉద్యమ స్థాపనకు నడుం కట్టారు. అప్పుడు పార్టీపై నిషేధం వుంది. అయినా వెనకడుగు వేయలేదు. వైనాడ్‌లో పేద ప్రజల ఇళ్లలో వుండి వారి స్థితిగతుల పట్ల ప్రత్యక్ష అవగాహన ఏర్పరుచుకున్నారు. సనాతన కుటుంబంలో పుట్టినా తాను శ్రామిక ప్రజల దత్తపుత్రుడనని సగర్వంగా ప్రకటించుకున్నారు. 1939 లోనే కాంగ్రెస్‌ తరపున శాసనసభకు ఎన్నికయ్యారు. అయితే అది కొద్దికాలమే వుంది. ఆ స్వల్ప కాలంలోనే ఆయన బాధ్యతలలో భాగంగా కౌలురైతుల సమస్యలు అధ్యయనం చేసి వారి విముక్తి కోసం ఒక నివేదిక రూపొందించారు. 1940లో కృష్ణ పిళ్లై అరెస్టు కావడంతో ఇంఎంఎస్‌ రాష్ట్ర కార్యదర్శి బాధ్యతలు చేపట్టారు. తనపై అరెస్టు వారంటు వున్నా నత్తి కారణంగా తనను గుర్తుపట్టే అవకాశం వున్నా సరే చివరి వరకూ రహస్య జీవితం గడిపారు. ఆ రహస్య కాలంలోనే మార్క్సిస్టు సిద్ధాంత గ్రంథాలనూ సాహిత్య పుస్తకాలను విపరీతంగా చదివేశారు. కేరళ సమాజ స్థితిగతులు, ఆర్థిక రాజకీయాంశాలు సమగ్రంగా అధ్యయనం చేశారు.
 

                                                                తొలి కమ్యూనిస్టు ముఖ్యమంత్రి

1952 ఎన్నికల్లో మద్రాసు శాసనసభకు పోటీ చేసి ఓటమి పాలైన నంబూద్రిపాద్‌ కొన్నేళ్లపాటు ఢిల్లీలో కమ్యూనిస్టు పార్టీ కేంద్ర కార్యాలయంలో వుండి పనిచేశారు. ఆ సమయంలో అనేక జాతీయ సమస్యలు, అంతర్జాతీయ సంబంధాలు ఆకళింపు చేసుకున్నారు. అంతర్జాతీయ సదస్సులలో పాల్గొంటూ అంతర్జాతీయ అంశాల అవగాహన, వివిధ దేశాల ప్రతినిధులతో సంబంధాలు పెంచుకున్నారు. ఈ నేపథ్యంతోనే 1957 ఎన్నికలలో కేరళలో కాంగ్రెస్‌ను ఓడించి తొలి కమ్యూనిస్టు ప్రభుత్వంలో ముఖ్యమంత్రి అయ్యారు. అధికారంలోకి రాగానే భూసంస్కరణలు అమలు చేశారు. భూస్వామ్య వ్యవస్థ నడ్డివిరిచే చర్యలు చేపట్టారు. కార్మికోద్యమాలు, ప్రజాందోళనల పట్ల పోలీసులు అణచివేత విధానాలు అనుసరించడాన్ని ఆయన తీవ్రంగా విమర్శిస్తూ ప్రజాస్వామిక సంస్కృతి తీసుకొచ్చారు. తర్వాతి కాలంలో కేరళ విద్యారంగంలో ప్రథమ స్థానంలోకి వచ్చిందంటే నాడు ఆ ప్రభుత్వం వేసిన పునాది ముఖ్య కారణం. ఎయిడెడ్‌ ప్రైవేటు విద్యాసంస్థల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడటానికి ఓ బిల్లు ప్రవేశపెట్టారు. తమ ఆధిపత్యాన్ని ఆర్థిక ప్రయోజనాలను ఏమాత్రం వదులుకోవడానికి సిద్ధపడని మత, వ్యాపార వర్గాలు ఈ బిల్లుపై గగ్గోలు పెట్టాయి. నాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలుగా వున్న ఇందిరాగాంధీ తండ్రి ప్రధాని నెహ్రూ ఆశీస్సులతో 'విమోచన ఉద్యమం' అంటూ ఈ స్వార్థపర శక్తులతో కలసి ప్రహసనం నడిపించారు. శాంతిభద్రతలు దెబ్బతిన్నాయన్న మిషతో నెహ్రూ ప్రభుత్వం 356వ అధికరణాన్ని ఉపయోగించి ఇఎంఎస్‌ ప్రభుత్వాన్ని 1959లో రద్దు చేసింది. రాష్ట్రాల హక్కులపై ఆనాడు పడిన వేటు ఇప్పుడు మోడీ హయాంలో పరాకాష్టకు చేరింది. ఆ వేటుకు గురైన తొలి ప్రభుత్వం ఆయనదే కావడం దేశాన్ని అప్రమత్తం చేసింది.
        యాభయ్యవ దశకం మధ్యకాలం నుంచి భారత కమ్యూనిస్టు ఉద్యమంలో పెరుగుతూ వచ్చిన సైద్ధాంతిక విభేదాలు 1962 విజయవాడ మహాసభ తర్వాత తారస్థాయికి చేరాయి. రివిజనిజంపై పోరాటం ఉధృతమైంది. అక్కడ సమన్వయ కోణంలో కార్యదర్శిగా ఎన్నికైన అజరు ఘోష్‌ చనిపోయారు. ఆ సమయంలో అందరికీ ఆమోదయోగ్యుడైన నాయకుడుగా ఇఎంఎస్‌ కార్యదర్శి అయ్యారు. సర్దుబాటు కోసం చైర్మన్‌ పోస్టు సృష్టించి డాంగేను ఎన్నుకున్నారు. ఆ క్లిష్ట సమయంలో ఇఎంఎస్‌ ఎంతో చాకచక్యంగా బాధ్యతలు నిర్వహించారు గాని సయోధ్య ఎక్కువ కాలం సాగలేదు. చైనాతో సరిహద్దు సమస్యను సాకుగా చూపి కేంద్రం ఇఎంఎస్‌, సుందరయ్య, జ్యోతిబసు వంటి నాయకులపై దుష్ప్రచారం చేసింది. అరెస్టు చేసింది. అయితే ఆయన ప్రపంచానికి తెలిసిన నాయకుడు గనక వ్యూహాత్మకంగా కొద్దికాలంలోనే విడుదల చేయాల్సి వచ్చింది. తర్వాత కాలంలో ఏర్పడబోయే సిపిఎం నాయకత్వంలో అత్యధిక భాగం జైలులో వున్నా నంబూద్రిపాద్‌ తదితరులు చాలా సమర్థంగా బాధ్యతలు నిర్వహించారు. 1964లో ఆ పార్టీ ఏర్పడిన నాటి నుంచి తొలి పొలిట్‌బ్యూరో సభ్యుడుగా సైద్ధాంతిక మార్గదర్శకులలో ఒకడుగా ఇఎంఎస్‌ అసమాన ప్రజ్ఞ కనబర్చారు. 1965లో జరిగిన కేరళ ఎన్నికల్లో మరోసారి సిపిఎం విజయం సాధించినా ఎన్నికైన వారంతా జైలులో వుండటం వల్ల ప్రమాణ స్వీకారం కుదరలేదు. కేంద్రం కుట్రతో ఆ కారణం చూపి ఎన్నికనే రద్దు చేసింది.
 

                                                              పరిపాలన, ఉద్యమం అధ్యయనం

1967లో మళ్లీ వామపక్ష ఐక్య సంఘటన ప్రభుత్వం ఏర్పడినప్పుడు ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టారు. ఇంచుమించు మూడేళ్లు వున్న ఆ ప్రభుత్వం అంతకు ముందు అసంపూర్ణంగా మిగిలిపోయిన ప్రజానుకూల కర్తవ్యాలు, విధానాలు పూర్తిచేసింది. 1970లలో మరో రెండు సార్లు కేరళ శాసనసభకు ఎన్నికైనప్పటికీ ఇఎంఎస్‌ ప్రధానంగా సిపిఎం కేంద్రంలో బాధ్యతలు నిర్వహించారు. ఇందిరా గాంధీ నిరంకుశ పోకడలు పెరిగిన కాలమది. వీటిని ఎదుర్కోవడంలోనూ ఆ రాజకీయ పంథా రూపకల్పన లోనూ ఆయన ముందున్నారు. మళయాలంలో 'దేశాభిమాని' తదితర పత్రికలతో ఆయనకు ప్రగాఢ అనుబంధం వుంది. 'పీపుల్స్‌ డెమోక్రసీ'కి కూడా దీర్ఘకాలం సంపాదకులుగా వ్యవహరించారు. అత్యవసర పరిస్థితి లోనూ ఇందిర నిరంకుశ పాలనను తీసుకొచ్చిన అప్రజాస్వామిక రాజ్యాంగ సవరణలనూ నిరసిస్తూ దేశమంతా విస్తారంగా పర్యటించి ప్రజలను చైతన్యపరిచారు. 1977 ఎన్నికలలో ఆమె ఓడిపోయిన తర్వాత ఆయన సిపిఎం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టారు. పదిహేనేళ్లపాటు అన్ని కీలక సందర్భాల్లో నాయకత్వం వహించారు. 1980లో కేరళలో మరోసారి వామపక్ష ప్రభుత్వం ఏర్పడినా ఆయన ముఖ్యమంత్రి బాధ్యతలు తీసుకోకుండా అధ్యయనం ఆధారంగా సలహాలు, సూచనలు అందిస్తూ అండగా నిలిచారు.
        1977-91 మధ్య కాలం దేశ రాజకీయాలలోనూ అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలోనూ పరీక్షా కాలం వంటిది. దేశంలో మతతత్వ రాజకీయాల పెరుగుదల మొదలైంది. సోషలిస్టు శిబిరం విచ్ఛిన్నమైంది. ఈ రెండు విషయాల్లోనూ నంబూద్రిపాద్‌ ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేశారు. మతతత్వ శక్తులకు అవకాశం లేకుండా అడ్డుకోవడం కోసం అహరహం కృషి చేశారు. కేరళ ఐక్య సంఘటన నుంచి ముస్లింలీగ్‌ వర్గాలు లేకుండా ఐక్య సంఘటనను లౌకిక శక్తులతో నిర్మించాలని సైద్ధాంతిక నిర్ణయానికి రావడంలో ఆయనది ముఖ్య పాత్ర అని చెప్పాలి. 1987లో ఆ విధంగానే ప్రభుత్వం ఏర్పడటానికి ఇది దారితీసింది. ఉద్యమ నిర్మాణం, సైద్ధాంతిక నిర్దేశంతో పాటు సామాజిక సంస్కరణలు, స్థానిక సంస్థల పటిష్టత, ప్రణాళికాబద్దమైన అభివృద్ధి వుండాలని నిరంతరం తపించడమే గాక అందుకు తగు పద్ధతులను కూడా తీసుకొచ్చారు. కేరళ మానవాభివృద్ధి సూచికలలో ముందు నిలవడానికి ఇదో ప్రధాన కారణం. ఇన్ని బాధ్యతల మధ్యనా మతి స్థిమితం లేని తన సతీమణిని శ్రద్ధగా చూసుకున్నారు. ఆయన సంతానం కూడా ఉద్యమంలో పనిచేశారు.
 

                                                                       విజ్ఞాన సర్వస్వం

నంబూద్రిని ప్రేమించని మళయాలీ అంటూ నాకెవరూ కనిపించలేదని ప్రసిద్ధ పాత్రికేయుడు ఎ.ఎస్‌.రామన్‌ ఒకసారి అన్నారు. ఎందుకంటే ఆయనను కేరళ రాజకీయాలలో భీష్మపితామహుడుగా పరిగణిస్తారు. ఎ.కె.గోపాలన్‌, కృష్ణ పిళ్లై, నంబూద్రి ఒక త్రయం. ఎన్నో ఉన్నత స్థానాలు అలంకరించడం ఎన్నో కీలక బాధ్యతలు నిర్వహించడం మాత్రమే గాక వ్యక్తిగత జీవితంలోనూ మచ్చలేని వ్యక్తి. కార్యకర్తలకు రాజకీయ స్పష్టత నివ్వడం ఆయన ప్రథమ కర్తవ్యంగా తీసుకునేవారు. సభలో మాట్లాడినా రాసినట్టుండే ఆయన శైలి ఎన్నో ప్రసంగాలు అనువదించిన ఈ వ్యాసకర్తకు సుపరిచితం. చిన్నప్పటి నుంచి కొనసాగిన నత్తిని ఖాతరు చేయని దీక్షాదక్షుడు. ఆయన నడక కూడా చాలా నెమ్మదిగా సాగేది. ఎన్నికల ద్వారా అధికారానికి వచ్చిన తొలి కమ్యూనిస్టు తాను కాదనీ, గుయానా అధ్యక్షుడు చెడ్డీ జగన్‌కు ఆ ఘనత దక్కుతుందని వినమ్రంగా ప్రకటించిన చారిత్రిక దృష్టి ఆయనది. తర్వాతి కాలంలో జ్యోతిబసు సుదీర్ఘకాలం కొనసాగిన ముఖ్యమంత్రి అయ్యారు. ఎలాంటి బాధ్యతలు నిర్వహిస్తున్నా ఆయన తన జీవిత పర్యంతం అధ్యయనం, రచన ఆపింది లేదు! రాజకీయ నాయకత్వం ప్రజా ఉద్యమాల్లో క్రియాశీల పాత్ర నిర్వహిస్తూ అంత విస్తారంగా చదివిన, రాసిన నాయకులు చాలా చాలా అరుదు. ఆయన రచనలు వందకు పైన పుస్తకాలుగా వచ్చాయి.
        ఇంతటి మహారథుడూ చమత్కార భాషణకూ పేరెన్నిక గన్నారు. బిబిసి విలేకరి ఒకసారి 'మీకు నత్తి ఎప్పుడూ వుంటుందా?' అని ప్రశ్నిస్తే 'లేదు...మాట్లాడేప్పుడే...' అని చమత్కారంగా జవాబిచ్చారు. 'వి.పి.సింగ్‌ ప్రభుత్వం మరెన్ని రోజులుంటుంద'ని విలేకరి ప్రశ్నిస్తే 'ఊహాగానాలు నా పని కాదు. మీ పత్రికల గుత్తసొమ్ము' అని ఠక్కున సమాధానం. ఇందిరా గాంధీ హయాంలో ఒకసారి జాతీయ అభివృద్ధి మండలి సమావేశంలో ఎందుకో థాంక్‌ గాడ్‌ అన్నారట. పక్కనే వున్న ఒక కేంద్రమంత్రి 'మీకు దేవుడిపై నమ్మకం ఎప్పుడు ఏర్పడింద'ని ఎగతాళి చేయబోయారు. 'అబ్బే...నాకు దయ్యాలను చూసినప్పుడల్లా దేవుడు గుర్తుకు వస్తాడ'ని ఎదురు వడ్డించారు నంబూద్రిపాద్‌. తన ఆత్మకథకు మళయాలంలో ఉత్తమ గ్రంథంగా పురస్కారం లభించింది. జీవితం చరమ దశలో మరోసారి 'దేశాభిమాని' గౌరవ సంపాదక బాధ్యతలు స్వీకరించి చివరి వరకూ రచనలు కొనసాగించారు. ఆయన కన్నుమూసే రోజున కూడా మరుసటి రోజు 'దేశాభిమాని' పత్రికలో రావాల్సిన వ్యాసం పూర్తిచేసి వుంచారట! ఇంతటి మహోన్నత ప్రజాపుత్రుడు, విజ్ఞాన సర్వస్వం 1998 మార్చి 19న తిరువనంతపురంలో కన్నుమూశారు. రాజకీయ భేదాలకు అతీతంగా దేశమంతా ఆయనకు నివాళులర్పించింది. కరుడు కట్టిన కమ్యూనిస్టు వ్యతిరేకి ఎల్‌.కె.అద్వానీ తన ఆత్మకథలో హోంమంత్రిగా తాను చేసిన మొదటి పని నంబూద్రిపాద్‌కు నివాళులర్పించడమేనని రాసుకోవడం ఇందుకు నిదర్శనం. 2009లో ఇఎంఎస్‌ శత జయంతి ఘనంగా జరిగింది. ఆయన స్మారకార్థం నిర్మించిన ఇఎంఎస్‌ అకాడమీ తన వారసత్వానికి తగినట్టే సాంస్కృతిక, రాజకీయ అధ్యయనాలకు కేంద్రంగా విరాజిల్లుతున్నది. ఆ కేంద్రంలో మూలమూలనా నంబూద్రిపాద్‌ నిలువెత్తు చిత్రాలు ఆయన స్ఫూర్తిని సజీవంగా నిల్పుతున్నాయి.

తెలకపల్లి రవి

తెలకపల్లి రవి