Sep 18,2023 13:42

హైదరాబాద్‌ : కేరళను బెంబేలెత్తించిన నిపా వైరస్‌ వ్యాప్తి నెమ్మదిగా తగ్గుముఖం పడుతోంది. వరుసగా రెండో రోజు కూడా ఎలాంటి కేసులు నమోదు కాకపోవడంతో ప్రభుత్వం ఊపిరి పీల్చుకుంది. ఇప్పటికే వైరస్‌ సోకిన వారు కోలుకుంటున్నట్లు రాష్ట్ర ఆరోగ్య మంత్రి వీణాజార్జ్‌ తెలిపారు. సకండ్‌ వేవ్‌ ఉండే అవకాశం లేదని స్పష్టం చేశారు. ఇన్ఫెక్షన్‌కు గురైన 9 ఏళ్ల చిన్నారి సహా నలుగురు కోలుకుంటున్నారని, చిన్నారికి వెంటిలేటర్‌ తొలగించినట్టు పేర్కొన్నారు. నిపా చికిత్స కోసం ప్రభుత్వ వద్ద అందుబాటులో ఉన్న మోనోక్లోనల్‌ యాంటీబాడీ ట్రీట్‌ మెంట్‌ విధానం ఈ వేరియంట్‌పై 50-60 శాతం ప్రభావవంతంగా పనిచేస్తోందని మంత్రి తెలిపారు. మరింత సమర్థవంతమైన వెర్షన్‌ను అందుబాటులోకి తెస్తామని ఇండియన్‌ మెడికల్‌ కౌన్సిల్‌ (ఐసీఎంఆర్‌) హామీ ఇచ్చిందని తెలిపారు.