
న్యూఢిల్లీ : ట్రైన్లో ప్రయాణిస్తున్న బిజెపి ఎంపిని దోమలు కుట్టాయని తెలిసిన వెంటనే ఆ ట్రైన్ను రైల్వే అధికారులు ఆపేసిన వైనం.. ఉన్నావ్లో జరిగింది. ఏంటీ..? దోమ కుడితేనే రైలును ఆపేస్తారా ? అవునండీ ... నిజంగానే ఆపేశారు.. ఆదరాబాదరాగా రైల్వే సిబ్బంది వచ్చి ఆ బోగీనంతా శుభ్రం చేసి స్ప్రే చల్లారు కూడా..! ఆ తరువాత కొద్దిసేపటికి రైలు కదిలిందట..!
అసలేమైందంటే ... ఉత్తరప్రదేశ్ లోని ఇటా బిజెపి ఎంపి రాజ్ వీర్ సింగ్ ఢిల్లీ నుంచి లక్నోకు వెళుతున్న గోమతి ఎక్స్ ప్రెస్ లోని ఏసీకోచ్ లో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో ఎంపి రాజ్ వీర్ సింగ్ ను దోమలు కుట్టాయి. ఆయనకు నిద్రాభంగం కలిగింది. దీంతో ఆయన అనుచరుడు మాన్ సింగ్ కు బాధేసింది. అయ్యో ... ! మా సార్ని దోమలు కుట్టాయి... నిద్రపోకుండా చేశాయి..! అంటూ... ఫీల్ అయిపోయి ఆ విషయాన్ని వెంటనే ట్విట్టర్లో రైల్వే శాఖకు ఫిర్యాదు చేశాడు. '' ఎంపి గారిని దోమలు కుడుతున్నాయి. టాయిలెట్ అధ్వానంగా ఉంది '' అని ట్విట్ చేయడంతో.. అంతే ... రైల్వే అధికారులు అగమేఘాల మీద పరుగులంకించారు. వెంటనే ఉన్నావ్ స్టేషన్ లో రైలును ఆపి ఎంపి రాజ్ వీర్ సింగ్ ప్రయాణించే బోగీ మొత్తాన్ని దగ్గరుండి మరీ శుభ్రం చేయించారు. స్ప్రే చేశారు. ఆ తర్వాతే రైలు కదిలింది.
ఇలా మా ఫిర్యాదులకు కూడా స్పందిస్తే బాగుండు : ప్రయాణీకులు
ఎంపి విషయంలోనే కాదు.. మా ఫిర్యాదులకు కూడా ఇలాగే స్పందిస్తే బాగుంటుందని ప్రయాణీకులు ఎద్దేవా చేస్తున్నారు. ఎంపి నే కాదు సాధారణ ప్రయాణికుల్ని కూడా రైల్లో దోమలు కుడుతుంటాయి. కానీ సిబ్బంది పట్టించుకుంటారా.. అబ్బే అంత సీన్ ఉండదు. కానీ ఆయన ఎంపి.... పైగా అధికార పార్టీ బిజెపి పార్లమెంట్ సభ్యుడు అందుకే సిబ్బంది అంత హడావిడి చేశారు. మరి ఆ దోమలకు తెలియదు కదా... ఆయన బిజెపి ఎంపి అని...!