
శ్రీహరికోట (తిరుపతి) : తిరుపతి జిల్లాలోని భారత అంతరిక్ష ప్రయోగ కేంద్రమైన సతీశ్ ధావన్ స్పేస్ సెంటర్ (షార్) రెండో ప్రయోగ వేదిక నుంచి గురువారం సాయంత్రం 6.02 గంటలకు పీఎస్ఎల్వీ-సి53 నింగిలోకి దూసుకెళ్లనుంది. రాకెట్ సన్నద్ధత, లాంచ్ ఆథరైజేషన్ సమావేశాల అనంతరం రాకెట్ ప్రయోగానికి అధికారులు పచ్చజెండా ఊపారు.
నిన్న సాయంత్రం నుండే కౌంట్డౌన్ ప్రారంభం..
ముందుగా నిర్దేశించిన సమయంలో అంతరిక్ష వ్యర్థాలు అడ్డు వస్తున్నాయని గుర్తించిన అధికారులు రెండు నిమిషాలు ఆలస్యంగా రాకెట్ను ప్రయోగించనున్నారు. ఇందుకు అవసరమైన కౌంట్డౌన్ ప్రక్రియ బుధవారం సాయంత్రం 4.02 గంటలకు ప్రారంభమయ్యింది. ఇది నిరంతరాయంగా 26 గంటలపాటు కొనసాగిన తరువాత వాహకనౌక నింగిలోకి దూసుకెళ్లనుంది.
మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ప్రవేశపెట్టనుంది..
న్యూ స్పేస్ ఇండియా లిమిటెడ్(ఎన్ఎస్ఐఎల్) వాణిజ్య పరమైన రెండో మిషన్ ఇది. సింగపూర్, కొరియాకు చెందిన మూడు ఉపగ్రహాలను నిర్ణీత కక్ష్యలో ఈ రాకెట్ ప్రవేశపెట్టనుంది. డీఎస్-ఈవో ఉపగ్రహం బరువు 365 కిలోలు. ఇది 0.5 మీటర్ల రిజల్యూషన్ ఇమేజింగ్ సామర్థ్యంతో ఎలక్ట్రో ఆప్టిక్, మల్టీ-స్పెక్ట్రల్ పేలోడ్ను కలిగి ఉంది. ఎన్ఇయూఎస్ఏఆర్ అనేది ఎస్ఏఆర్ పేలోడ్ను మోసుకెళ్లే సింగపూర్కు చెందిన మొట్టమొదటి బుల్లి వాణిజ్య ఉపగ్రహం.