Aug 24,2023 07:45
  •  30 వ తేదికి తుది నివేదిక
  •  సిఇసి ఆదేశం

ప్రజాశక్తి - అమరావతి బ్యూరో : రాష్ట్రంలో ఓట్ల తొలగింపుపై పున:పరిశీలన చేయాలని కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశించింది. ఈ మేరకు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేష్‌ కుమార్‌ మీనా మెమో జారీ చేశారు. జిల్లా ఎన్నికల అధికారులకు జారీ చేసిన ఈ మెమోలో 2022 జనవరి ఆరవ తేది నుండి ఇప్పటి వరకు చేసిన తొలగింపులన్నింటిని పున:పరిశీలన చేయాలని పేర్కొన్నారు. ఈ నెల 30 వ తేది నాటికి ఈ ప్రక్రియను పూర్తిచేసి కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదిక పంపాలని తెలిపారు. బిఎల్‌ఓలు 100 శాతం క్షేత్ర పరిశీలన జరపాలని, ఆ తరువాత ఇఆర్‌ఓలు కనీసం వెయ్యి తొలగింపులను పరిశీలించాలని పేర్కొన్నారు. ప్రతి శాసనసభ నియోజక వర్గంలో కనీసం 500 తొలగింపులను పరిశీలించేందుకు ఒక ప్రత్యేక అధికారిని నియమిం చాలన్నారు.ప్రతి నియోజకవర్గం లో కనీసం 100 తొలగింపులను జిల్లా కలెక్టర్‌ లేదా జిల్లా ఎన్నికల అధికారి స్వయంగా పరిశీలించాలని పేర్కొన్నారు. ఈ ప్రక్రియను పూర్తిచేసి సాధ్యమైనంత త్వరగా నివేదిక ను సిఇఓ కార్యాలయానికి చేర్చాలని ఆదేశించారు. కాకినాడ పట్టణంలో ఓటర్ల తొలగింపు నకు సంబంధించి కంప్యూటర్ల సెంటర్లు కేంద్రంగా ఫామ్‌ 7 దరఖాస్తులు వెలువెత్తుతున్నాయని రాష్ట్ర ఎన్నికల కమిషన్‌కు టిడిపి ఎమ్మెల్సీ అశోక్‌బాబు బుధవారం లేఖ రాశారు. ఇదే విషయంపై కాకినాడ సిటీ మాజీ ఎమ్మెల్యే వనమూడి వెంకటేశ్వరరావు సిఇఓకు ఫిర్యాదు చేశారు. ఇది ఇలా ఉంటే నియోజకవర్గాల్లో అర్హులైన ఓట్ల తొలగింపు అధికారపార్టీ కనుసన్నల్లో జరుగుతోందని, ఓటర్ల వెరిఫికేషన్‌ నిజాయితీగా చేయించాలని, నిబంధనలు అతిక్రమించిన అధికారులపై చర్యలు తీసుకో వాలంటూ ఈనెల 28న టిడిపి అధ్యక్షులు చంద్రబాబునాయుడు ఢిల్లీలో కేంద్ర ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేయనున్నారు.