May 26,2023 22:15
  • అదానీపై జెపిసి వేయాల్సిందే
  • రాజదండం వాడటం ఫాసిస్టు చర్య

ప్రజాశక్తి-అమరావతి బ్యూరో : నూతన పార్లమెంటు భవన ప్రారంభోత్సవం చేసే విషయంలో రాష్ట్రపతిని విస్మరించడం రాజ్యాంగ వ్యతిరేక చర్య అని సిపిఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి అన్నారు. ఉభయసభలకు అధిపతి రాష్ట్రపతి తప్ప ప్రధాన మంత్రి కాదన్నారు. రాష్ట్రపతిని విస్మరించి నూతన పార్లమెంటు భవనాన్ని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రారంభించడం తగదన్నారు. రాజ్యాంగ, ప్రజాస్వామ్య వ్యతిరేక చర్యగా దేశంలోని 19 రాజకీయ పార్టీలు వ్యతిరేకిస్తూ ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని బహిష్కరించాయని తెలిపారు. శుక్రవారం విజయవాడలోని ఎంబివికెలో సిపిఎం పొలిట్‌బ్యూరో సభ్యులు ఎంఎ బేబి, రాష్ట్ర కార్యదర్శి వి శ్రీనివాసరావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 79లో పార్లమెంటులోని ఉభయ సభలను నడిపించేది రాష్ట్రపతే అని స్పష్టంగా రాసుకున్నామని తెలిపారు. ప్రధాన మంత్రి పార్లమెంటుకు కూడా నాయకుడు కాదు అనేది తెలుసుకోవాలన్నారు. కేవలం అధికార పార్టీకి నాయకుడు మాత్రమేనని అన్నారు. ప్రతిపక్షానికి కూడా కేబినెట్‌ మంత్రి హోదాతో ఒక నాయకుడు వుంటారన్నారు. పార్లమెంటులో ప్రభుత్వం ప్రవేశపెట్టిన బిల్లులు చట్టరూపం దాల్చాలంటే రాష్ట్రపతి ఆమోదం వుండాల్సిందేనన్నారు. అన్ని అధికారాలూ రాష్ట్రపతి చేతిలోనే వున్నాయన్నారు. ఈ అంశాలను రాజ్యాంగపీఠికలో పొందుపరిచారన్నారు. ప్రభుత్వం పార్లమెంటుకు జవాబుదారీ అయితే, ఎంపిలు ప్రజలకు జవాబుదారీగా వుంటారని అన్నారు. గతంలో ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రారంభోత్సవాలు చేశారని చెప్పే బిజెపి నాయకులు ఇపుడు పార్లమెంటులో క్యాంటిన్‌ వంటివి ప్రారంభోత్సవం చేసుకోవచ్చన్నారు. రాజ్యాంగ అధిపతిని అగౌరపరిచే చర్యలను అంతా ఖండించాలని కోరారు.

  • రాజదండం చేతబట్టడం ఫాసిస్టు చర్య

ప్రధాని నరేంద్ర మోడీ రాజదండంను చేతబట్టడం పూర్తి ఫాసిస్టు చర్య అని అన్నారు. రాజరిక వ్యవస్థలో అధికారం దేవుడు ఇచ్చాడనేందుకు గుర్తుగా పండితులు రాజదండంను రాజుకు ఇచ్చేవారని తెలిపారు. ప్రజాస్వామ్య దేశంలో రాజదండం ఎలా వాడుతారని అన్నారు. నాడు స్వాతంత్య్రం వచ్చిన కొత్తలో చాలామంది రాజులు ప్రధాని నెహ్రూకు బహుమతులు ఇచ్చారని, అందులో భాగంగానే చోళరాజవంశీయులు రాజదండాన్ని నెహ్రూకు ఇచ్చారని తెలిపారు. తనకు ప్రజలు అధికారం ఇచ్చారు తప్ప దేవుడుకాదని, వారు ఇచ్చిన రాజదండాన్ని అలహాబాద్‌లోని మ్యూజియంలో పెట్టించారని అన్నారు. ఇపుడు మోడీ అధికారం దేవుడు ఇచ్చాడనే చాటుకునేందుకు మళ్లీ రాజదండం చేతబట్టడం సరికాదన్నారు. హిందూరాజ్యంను పునర్నిర్మించాలనే కుట్రలో భాగంగానే రాజదండంను తెరపైకి తెచ్చారన్నారు.

  • అదానీ వ్యవహారంపై జెపిసి తప్ప మరో మార్గం లేదు

అదానీ కుంభకోణాల విషయంలో ప్రధాని సమాధానం చెప్పకపోవడం బాధ్యతా రాహిత్యమన్నారు. లక్షల కోట్ల ప్రజాధనం ఎస్‌బిఐ, ఎల్‌ఐసి ద్వారా అదానీకి కట్టబెట్టారని విమర్శించారు. సుప్రీంకోర్టు వేసిన కమిటీకి సెబి ఆధారాలు ఇవ్వాల్సి వుండగా, సెబి అధికారాలపై మోడీ కోత పెట్టారని, అలాంటప్పుడు ఎలా ఆధారాలు వస్తాయని ప్రశ్నించారు. అధికారులు లేని సెబిని అడ్డంపెట్టుకుని క్లీన్‌చిట్‌ తెచ్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారని తెలిపారు. అదానీ వ్యవహారంలో జాయింట్‌ పార్లమెంటరీ కమిటీ తప్ప మరో మార్గం లేదన్నారు. సెబికి లేని అధికారాలు కూడా జెపిసికి వుంటాయని అన్నారు. క్రోనిక్యాపిటల్‌తో దేశంలో పెద్ద దోపిడీ జరుగుతోందన్నారు.

  • నిరంకుశవాదం పెరుగుతోంది

దేశంలో నరేంద్ర మోడీ ప్రభుత్వ నిరంకుశవాదం ప్రమాదకరంగా పెరిగిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీ, పాండిచ్ఛేరి వంటి రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల స్థానంలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల ద్వారా పాలించుకోవాలన్న కేంద్ర ప్రభుత్వ నిర్ణయాన్ని సుప్రీంకోర్టు వ్యతిరేకిస్తూ జడ్జిమెంటు ఇచ్చిందన్నారు. ఆ తీర్పును నిర్వీర్యం చేసేలా కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్‌ తెచ్చి మళ్లీ అధికారాలన్నీ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ల చేతికే ఇవ్వడం ప్రమాదకర చర్య అని అన్నారు. ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు.

  • నోట్ల రద్దు తుగ్లక్‌ చర్య అని నిరూపణైంది

దేశంలో అవినీతిని అరికడతామని, నల్లడబ్బును వెలికి తీస్తామని నరేంద్ర మోడీ ప్రభుత్వం చేసిన పెద్దనోట్ల రద్దు ప్రక్రియ తుగ్లక్‌ చర్య అని నిరూపణ అయ్యిందని తెలిపారు. రూ.ఐదు వందలు, రూ.వెయ్యి నోట్లు రద్దుచేసి రూ.రెండువేల నోటును తేవడాన్ని తీవ్రంగా వ్యతిరేకించామని అన్నారు. నోట్లరద్దు ప్రక్రియతో అవినీతి తగ్గకపోగా అవినీతి విలువ పెరిగిపోయిందని అన్నారు.