
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ అప్పులు రెండింతలు అయ్యాయి. ఈ మేరకు మంగళవారం రాజ్యసభలో టిడిపి ఎంపి కనకమేడల రవీంద్ర కుమార్ అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. 2019తో పోలిస్తే ఎపి అప్పులు దాదాపు రెండింతలు పెరిగాయని తెలిపారు. '2019లో ఎపి అప్పులు రూ.2,64,451 కోట్లు ఉండగా.. 2020లో రూ.3,07,671 కోట్లు, 2021లో రూ.3,53,021 కోట్లు, 2022 సవరించిన అంచనాల తరువాత రూ.3,93,718 కోట్లు, 2023 బడ్జెట్ అంచనాల ప్రకారం ప్రస్తుత ఎపి అప్పు రూ.4,42,442 కోట్లుగా ఉంది. ఏటా సుమారు రూ.45 వేల కోట్లు అప్పులు చేస్తోంది' అని పంకజ్ చౌదరి వెల్లడించారు. బడ్జెటేతర అప్పులు అదనం. రాష్ట్ర ప్రభుత్వం శాసనసభలో వెల్లడించిన బడ్జెట్ అప్పులకు తోడు, కార్పొరేషన్లు సహా ఇతర మార్గాల్లో ఎపి చేస్తున్న అప్పులు దీనికి అదనమని కేంద్ర మంత్రి వెల్లడించారు.