Mar 19,2023 22:02

విశాఖ :విశాఖలో ఆస్ట్రేలియాతో జరిగిన రెండో వన్డేలో టీమిండియా 10 వికెట్ల తేడాతో దారుణంగా ఓడిపోయింది. మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌ 26 ఓవర్లలో 117 పరుగులకు ఆలౌట్‌ కాగా... ఆసీస్‌ 11 ఓవర్లలోనే లక్ష్యాన్ని ఛేదించింది. టీమిండియా బౌలర్లు కనీసం ఒక్క వికెట్‌ కూడా తీయలేక ఉసూరుమనిపించారు. ఆసీస్‌ ఓపెనర్‌ మిచెల్‌ మార్ష్‌ విశాఖ పిచ్‌ పై శివతాండవం చేశాడు. భారత బ్యాట్స్‌ మెన్‌ ఆపసోపాలు పడినచోట, ఈ ఆజానుబాహుడు బౌండరీల వర్షం కురిపించాడు. మార్ష్‌ 36 బంతుల్లో 6 ఫోర్లు, 6 సిక్సర్లతో 66 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరో ఎండ్‌ లో ట్రావిస్‌ హెడ్‌ కూడా అర్ధసెంచరీ సాధించాడు. హెడ్‌ 30 బంతుల్లో 10 ఫోర్లు బాది 51 పరుగులు నమోదు చేశాడు. ఈ విజయంతో మూడు వన్డేల సిరీస్‌ ను ఆసీస్‌ 1-1తో సమం చేసింది. ఇక చివరిదైన మూడో వన్డే ఈనెల 22న చెన్నైలో జరగనుంది.