
ప్రజాశక్తి-న్యూఢిల్లీ బ్యూరో : ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి కేసుపై ఈనెల 23న సుప్రీంకోర్టులో విచారణ జరుగనుంది. రాజధాని కేసును త్వరితగతిన విచారించాలని సోమవారం సుప్రీంకోర్టుకు ఏపి ప్రభుత్వం మరోసారి విజ్ఞప్తి చేసింది. పిటిషన్లను త్వరితగతిన విచారించాలని జస్టిస్ కెఎం జోసెఫ్, జస్టిస్ నాగరత్న ధర్మాసనం వద్ద రాష్ట్ర ప్రభుత్వ న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రత్యేకంగా ప్రస్తావించారు. కోర్టు ఇచ్చిన నోటీసులు తమకు జనవరి 27న అందాయని రైతుల తరపు న్యాయవాదులు తెలిపారు. కౌంటర్ దాఖలు చేయడానికి తమకు కనీసం రెండు వారాల సమయం ఇవ్వాలని కోరారు. దీంతో ఈనెల 23న విచారణకు తీసుకుంటామని ధర్మాసనం వెల్లడించింది. మొదటగా ఈ కేసును మెన్షన్ లిస్టులో చేర్చాలని సుప్రీం కోర్టు రిజిస్ట్రార్కు రాష్ట్ర ప్రభుత్వం లేఖ రాసింది. ఇందుకు రిజిస్ట్రార్ నుంచి అనుమతి లభించలేదు. అయినప్పటికీ బెంచ్పై రాష్ట్ర ప్రభుత్వం తరపున న్యాయవాది నిరంజన్ రెడ్డి ప్రస్తావించారు. దీంతో ఈనెల 23న కేసును విచారించేందుకు సుప్రీంకోర్టు అంగీకారం తెలిపింది.