Mar 18,2023 21:40

28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
ప్రజాశక్తి-కావలి :
నెల్లూరు జిల్లా కావలి ఫారెస్ట్‌ బీటు పరిధిలో ముగ్గురు స్మగ్లర్లను టాస్క్‌ ఫోర్స్‌ పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. టాస్క్‌ఫోర్స్‌ అధికారుల కథనం ప్రకారం... టాస్క్‌ఫోర్స్‌ ఎస్‌పి కె చక్రవర్తి ఆదేశాల మేరకు డిఎస్‌పి మురళీధర్‌ ఆధ్వర్యంలో ఆర్‌ఐ కృపానంద బృందం, ఆర్‌ఎస్‌ఐ అలీ బాషా బఅందం రాపూరు నుంచి తనిఖీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా కావలి వద్ద అన్నపూర్ణ రైస్‌ మిల్లు సమీపంలో కొందరు వ్యక్తులు అనుమానాస్పదంగా కనిపించారు. వారిని పట్టుకోవడానికి ప్రయత్నించగా ముగ్గురు వ్యక్తులు పారిపోయారు. మరో ముగ్గురు పట్టుబడ్డారు. వారి వద్ద నుంచి 28 ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. నిందితులు నెల్లూరు టౌన్‌కు చెందిన గల్లా ఉదయ భాస్కర్‌, బద్వేలుకు చెందిన అబ్బు భాస్కర్‌, బాలాయపల్లికి చెందిన రియాజ్‌లు పట్టుబడ్డారు. పరారీలో ఉన్న ఏర్పేడుకు చెందిన మణి, సుధాకర్‌, రైల్వే కోడూరుకు చెందిన దశరథ నాయుడు కోసం గాలిస్తున్నారు. ఎర్రచందనం దుంగల బరువు 816 కిలోలు ఉందని, దీని విలువ రూ.75 లక్షలు ఉంటుందని డిఎస్‌పి తెలిపారు. సిఐ చంద్రశేఖర్‌ కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆపరేషన్‌లో పాల్గన్న అధికారులను డిఐజి సెంథిల్‌ కుమార్‌ అభినందించి రివార్డ్స్‌ ప్రకటించారు.