Mar 27,2023 09:54

గన్నవరం గ్రామీణం : ప్రముఖ పుణ్యక్షేత్రమైన షిర్డీకి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రోజువారీ ప్రత్యేక విమాన సర్వీసును ఇండిగో సంస్థ ఆదివారం నుండి ప్రారంభించింది. తిరుపతి నుంచి విజయవాడ మీదుగా షిర్డీ సర్వీసు రాకపోకలు ఉంటాయని అధికారులు తెలిపారు. 72 మంది ప్రయాణికుల సామర్థ్యం కలిగిన ఏటీఆర్‌ 72-600 విమానం మధ్యాహ్నం 12 గంటలకు తిరుపతి నుంచి విజయవాడ విమానాశ్రయానికి చేరుకుంది. 12:25 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి షిర్డీ వెళ్లింది. షిర్డీ నుంచి మధ్యాహ్నం 02:20 గంటలకు బయలుదేరి 4:26 గంటలకు విజయవాడ చేరుకొనేలా నిత్యం మరో సర్వీసు నడుస్తుందని సంస్థ ప్రతినిధులు వెల్లడించారు. టికెట్‌ ప్రారంభ ధర రూ.4,639గా నిర్ణయించారు. ప్రయాణ తేదీ దగ్గరపడినకొద్దీ డిమాండ్‌ ఆధారంగా టికెట్‌ ధర పెరుగుతుంది. తొలిరోజు 70మంది షిర్డీకి తరలివెళ్లారు. షిర్డీ నుంచి విజయవాడకు 65మంది చేరుకున్నారని సంస్థ ప్రతినిధులు వివరించారు.