
ఢిల్లీ: విశాఖపట్నం రాజధాని కాబోతోందని.. త్వరలో తాను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నట్లు ఎపి సీఎం జగన్ చెప్పారు. దిల్లీలోని లీలా ప్యాలెస్ హౌటల్లో నిర్వహించిన ఎపి గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ రౌండ్ టేబుల్ సమావేశంలో సీఎం మాట్లాడారు. ''మార్చి 3, 4 తేదీల్లో విశాఖపట్నంలో ఇన్వెస్టర్ల సదస్సు జరగనుంది. మిమ్మల్ని విశాఖకు ఆహ్వానిస్తున్నా. విశాఖపట్నం రాజధాని కాబోతోంది. కొన్ని నెలల్లో నేను కూడా అక్కడికి షిఫ్ట్ అవుతున్నా. మిమ్మల్ని మరోసారి విశాఖలో కలవాలని ఆకాంక్షిస్తున్నా'' అని జగన్ వ్యాఖ్యానించారు.
ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన: వైవీ సుబ్బారెడ్డి
న్యాయపరమైన సమస్యలు పరిష్కరించుకుని ఏప్రిల్ లోపే విశాఖ నుంచి పాలన జరుగుతుందని తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నారు. విశాఖ నుంచి పాలన కొనసాగించేందుకు సీఎం జగన్ కట్టుబడి ఉన్నారని చెప్పారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు కూడా చేస్తామన్నారు. నగరంలో ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నాయని.. అవసరమైతే ప్రైవేటు భవనాలను కూడా తీసుకోవచ్చన్నారు. భీమిలి రోడ్డులో ఉన్న ప్రభుత్వ కార్యాలయాలనూ కొంతమేర వాడుకోవచ్చని చెప్పారు. సీఎం నివాసం, క్యాంపు కార్యాలయం ప్రస్తుతానికి ప్రభుత్వ గెస్ట్హౌస్లో ఏర్పాటు చేసి ఆ తర్వాత నిదానంగా మారొచ్చని వైవీ సుబ్బారెడ్డి వ్యాఖ్యానించారు.