Sep 18,2023 19:51

హైదరాబాద్‌ : నిజాం పాలన, అప్పట్లో రజాకార్లు చేసిన అకృత్యాలే ఇతివృత్తంగా తెరకెక్కిన ''రజాకార్‌'' సినిమా వివాదాలకు తావిస్తోంది. యాటా సత్యనారాయణ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు గూడూరు నారాయణ రెడ్డి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా విడుదల చేసిన టీజర్‌ వివాదాస్పదమవుతోంది. ఓ వర్గాన్ని విలన్‌గా చూపించారన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో రజాకార్‌ ట్రైలర్‌ మంత్రి కేటీఆర్‌కు ట్యాగ్‌ చేశాడో వ్యక్తి. ప్రజల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టే విధంగా ట్రైలర్‌ వుందని ఫిర్యాదు చేశారు. ఈ ట్వీట్‌పై కేటీఆర్‌ స్పందించారు. మత హింసను ప్రేరేపించడానికి బీజేపీ ప్రయత్నిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శాంతి భద్రతలు దెబ్బతినకుండా చూస్తామని మంత్రి తెలిపారు. సినిమాను నిలిపివేయాలని సెన్సార్‌ బోర్గును కోరతామని మంత్రి కేటీఆర్‌ పేర్కొన్నారు.