
న్యూఢిల్లీ : ఈ ముఖ్యమంత్రి ఉండగా తాను ఆంధ్రప్రదేశ్లో అడుగుపెట్టలేనేమోనని వైసిపి ఎంపి రఘురామకృష్ణరాజు అసహనాన్ని వ్యక్తం చేశారు. సోమవారం ఢిల్లీలో మీడియాతో ఎంపి రఘురామకృష్ణం రాజు మాట్లాడుతూ ... ఎన్నికల నియామవళి అమల్లోకి వచ్చి పోలీసులు ముఖ్యమంత్రి అదుపు ఆజ్ఞల్లో లేనప్పుడే తాను రాష్ట్రంలో అడుగు పెట్టగలనని భావిస్తున్నానన్నారు.
వారి క్షేమం కోసమే అల్లూరి విగ్రహావిష్కరణకు వెళ్లలేకపోయా : వైసిపి ఎంపి రఘురామకృష్ణంరాజు
తనను అభిమానించి, ప్రేమించే ఎంతోమందిని పోలీసులు అదుపులోకి తీసుకుని చిత్రహింసలకు గురి చేయడంతో వారి క్షేమం కోసమే అల్లూరి సీతారామరాజు విగ్రహావిష్కరణకు వెళ్లలేకపోయానని ఎంపి రఘురామకృష్ణంరాజు తెలిపారు. ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు యువకులను కారులో ఎక్కించుకొని ఎక్కడికో తీసుకువెళ్లినట్టు వారి తండ్రి తనకు ఫోన్ చేసి వాపోయారని చెప్పారు. తన కారణంగా చిత్రహింసలకు గురైన వారంతా తనను క్షమించాలని ఎంపి విజ్ఞప్తి చేశారు. రాష్ట్రంలో ఒక ఎంపి బతికే పరిస్థితుల్లేవని ఆవేదన వ్యక్తం చేశారు.
ఆహ్వానితుల జాబితాలోనే నా పేరు లేదు : ఎంపి రఘురామకృష్ణంరాజు
ఎంపిలు అంటే చట్టాలు చేసే వారు అని ప్రజలు అనుకుంటారు కానీ చట్టాలు చేసే ఒక ఎంపికే తన సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టలేని పరిస్థితి నెలకొనడం దురదఅష్టకరమని ఎంపి రఘురామకృష్ణంరాజు తెలిపారు. తన నియోజకవర్గంలోని కార్యక్రమంలో పాల్గనకపోతే తనకు అహంకారం ఉందని ప్రధానమంత్రి ఎక్కడ భావిస్తారోననే ఆందోళన ఉండేదని.. ప్రధాని కార్యాలయం నుంచి వచ్చిన ఆహ్వానితుల జాబితాలోనే తన పేరు లేకపోవడంతో ఆ బాధ తొలగిపోయిందన్నారు.
అంత అవసరమేంటి ? ఆ విషయమై కోర్టును ఆశ్రయిస్తా : ఎంపి రఘురామకృష్ణం రాజు
పార్లమెంటరీ లా జస్టిస్, పబ్లిక్ గ్రీవెన్స్ కమిటీ సభ్యుడినైన తనకు జరిగిన అన్యాయం దేశంలో మరెవరికీ జరగలేదు అని ఎంపి రఘురామకృష్ణంరాజు ఆవేదన చెందారు. తన ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ కానిస్టేబుల్గా చెప్పుకొనే ఒక వ్యక్తిని సోమవారం భద్రతా సిబ్బంది అదుపులోకి తీసుకొని గచ్చిబౌలి పోలీసులకు అప్పగించారని చెప్పారు. తన ఇంటి వద్ద ఇంటెలిజెన్స్ పోలీసులను నియమించాల్సిన అవసరం ఏమిటి ? అని ప్రశ్నించారు. ఈ విషయమై తాను కోర్టును ఆశ్రయించనున్నానని రఘురామ వెల్లడించారు.