
కాబూల్ : ఆఫ్ఘనిస్తాన్లో భారీ భూకంపం సంభవించింది. నిమిషాల వ్యవధిలోనే రెండుసార్లు భూకంపం సంభవించడంతో పదుల సంఖ్యలో మృతి చెందారు. వివరాల్లోకి వెళితే.. పశ్చిమ ఆఫ్ఘన్లోని ముక్వార్, క్వాదీస్ జిల్లాల్లో సోమవారం రాత్రి భూకంపం వచ్చింది. అలాగే ప్రావిన్స్లోని ముఖ్ర్ జిల్లాలో కూడా భూకంపం సంభవించింది కానీ అక్కడ జరిగిన ప్రాణ, ఆస్తి నష్టం వివరాలు ఇంకా తెలియాల్సి ఉందని అధికారులు తెలిపారు. భూకంప తీవ్రత రిక్టర్ స్కేలుపై 5.3గా నమోదైనట్లు యూఎస్ జియాలజికల్ సర్వే తెలిపింది. ఇక బాద్గీస్ పశ్చిమ ప్రావిన్స్లోని ఖాదీస్ జిల్లాలో భూకంప తీవ్రతకు ఇళ్ల పైకప్పులు మీద పడటంతో.. 26 మంది మరణించారని తాలిబన్ అధికార ప్రతినిధి బాజ్ మొహమ్మద్ సర్వారీ పేర్కొన్నారు. మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు చిన్నారులు ఉన్నారు. చాలామంది గాయపడ్డారని, మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని ఆయన తెలిపారు.
కాగా గతేడాది తాలిబన్లు ఆప్ఘన్ను స్వాధీనపరుచుకున్నాక.. అక్కడి ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారు. దానికితోడు వరుస భూకంపాలతో ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. అయితే తాలిబన్లు అధికారాన్ని చేజిక్కించుకున్న తర్వాత తొలి ప్రకృతి విపత్తు ఇదే కావడం గమనార్హం.

