Sep 20,2023 00:38

సమావేశంలో మాట్లాడుతున్న సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ

ప్రజాశక్తి- విఆర్‌.పురం
కేంద్రంలోని బిజెపి, రాష్ట్రంలోని వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ అవలంభిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగడుతూ అక్టోబర్‌ 15వ తేదీన రంపచోడవరంలో నిర్వహించే బహిరంగ సభను జయప్రదం చేయాలని సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పూనెం సత్యనారాయణ, మండల కార్యదర్శి సోయం చిన్నబాబు పిలుపునిచ్చారు. మండలంలోని రామవరంలో సిపిఎం నాయకులు కారం సుందరయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సామాన్యులపై మోయలేని భారాలు వేస్తున్నాయని, పెట్రోల్‌ డీజిల్‌ ధరలు ఆకాశాన్నంటాయని పేర్కొన్నారు. ఉపాధి ఉద్యోగ అవకాశాలు పూర్తిగా సన్నగిల్లాయన్నారు. అక్టోబర్‌ 15న జరుగు బహిరంగ సభలో సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగిస్తారని చెప్పారు. బహిరంగ సభ విజయవంతానికి గ్రామ గ్రామాన కార్యకర్తలు సైనికుల్లా పనిచేయాలని సూచించారు. ఈ సమావేశంలో ఎంపీపీ కారం లక్ష్మి, నాయకులు పంకు సత్తిబాబు, పడ్లాది రమేష్‌, ఆసు లక్ష్మయ్య, గుండిపూడి లక్ష్మణరావు, సుబ్బారావు, కార్యకర్తలు పాల్గొన్నారు.