
-సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు మంతెన సీతారాం
-పలుచోట్ల అల్లూరి 125 జయంతి.. ఘన నివాళులర్పించిన సిపిఎం, ప్రజాసంఘాల నేతలు
మన్యం ప్రాంతంలోని సమస్యల పరిష్కారం పట్ల కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చూపిస్తున్న నిర్లక్ష్య వైఖరిపై అల్లూరి సీతారామరాజు పోరాటాలను స్ఫూర్తిగా తీసుకొని ఉద్యమాలను ఉధృతం చేయాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం పిలుపునిచ్చారు. ఆదివారం ఏజెన్సీలోని పలుమండలాల్లో అల్లూరి 125వ జయంతిని సిపిఎం, అనుబంధ ప్రజాసంఘాల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వమించారు. మన్యం వీరుడు అల్లూరితోపాటు గంటందొర, మల్లుదొర, కొమరం భీం విగ్రహాలు, చిత్రపటాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
(ప్రజాశక్తి విలేకర్ల యంత్రాంగం)
అల్లూరి అందరివాడు
చింతూరు : దేశ స్వాతంత్రం కోసం పోరాడి నేలకొరిగిన భగత్సింగ్ సమకాలికుడు అల్లూరి అందరివాడని సిపిఎం రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు మంతెన సీతారాం అన్నారు. చింతూరు మండలం ఎర్రంపేటలో అల్లూరి 125వ జయంతి ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో అల్లూరితోపాటు గంటందొర, మల్లుదొర, కొమరంభీం విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించరాఉ. ఈ సందర్భంగా గిరిజన సంఘం నాయకులు సీసం సురేష్ అధ్యక్షతన నిర్వహించిన సదస్సులో మాట్లాడుతూ, 20ఏళ్ల చిరుప్రాయంలోనే స్వాతంత్య్రం కోసం, దోపిడీకి గురౌతున్న అమాయక ఆదివాసీల విముక్తి కోసం బ్రిటీషర్లపై తిరుగుబావుటా ఎగరేసి అల్లూరి పోరాటాలు అందరికీ స్ఫూర్తిదాయకమన్నారు ఆదివాసీలకు చదువు నేర్పుతూ వారి మూఢనమ్మకాలను పారదోలడంతోపాటు మూలికా వైద్యం అందించేవాడన్నారు. మల్లుదొర, గంటందొర, పడాలు వంటి గిరిజన పోరాట నాయకులను తయారుచేసి బ్రిటిష్ వారి పాలిట సింహస్వప్నంగా నిలిచారన్నారు.
రంపచోడవరం జిల్లా కార్యదర్శి కిరణ్ మాట్లాడుతూ గిరిజనానికి కొండపోడుపట్టాలు, పోలవరం నిర్వాసితులకు ప్యాకేజీలు ఇవ్వకుండా దుర్మార్గంగా వ్యవహరిస్తున్న కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతీరుపై పోరాడదామన్నారు.వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు ఎర్రంశెట్టి శ్రీనివాస్ మాట్లాడుతూ ప్రజల హక్కులపై దాడులు చేస్తూ, ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని, స్వేచ్ఛ హక్కులను హరిస్తున్న ప్రభుత్వాలపై పోరాటం చేయడమే అల్లూరికి నిజమైన నివాళి అన్నారు. సదస్సుకు ముందు అల్లూరి సీతారామరాజు జయంతి ప్రత్యేక సంచికను ఆవిష్కరించారు. కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు పునేమ్ సత్యనారాయణ, పల్లపు వెంకట్, వి.ఆర్.పురం ఎంపీపీ కారం లక్ష్మి,మాజీ జెడ్పిటిసి ముర్రం రంగమ్మ, వి.ఆర్.పురం సిపిఎం మండల కార్యదర్శి రైతు సంఘం నాయకులు నాగిరెడ్డి, గిరిజన సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు సర్పంచ్ పులి సంతోష్,యువజన సంఘం నాయకుడు వివేక రాజ్ కుమార్, సిఐటియు చింతూరు మండల అధ్యక్షుడు పి లక్ష్మణ్, సిపిఎం మండల కమిటీ సభ్యులు మొతుమ్ రాజయ్య,సుబ్బారావు, కారం నాగేష్ పాల్గొన్నారు
రాజవొమ్మంగి : స్థానిక అల్లూరి జంక్షన్ వద్ద అల్లూరి సీతారామరాజు అల్లూరి విగ్రహానికి గిరిజన సంఘం, సిఐటియు, డివైఎఫ్ఐ, ఇతర ప్రజాసంఘాల నేతలు సింగిరెడ్డి అచ్చారావు, పి రామరాజు, టి శ్రీను, పి శ్రీను, ఎస్ నాగు, కె రాంబాబు తదితరులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. బ్రిటీషర్లను గడగడలాడించి, తెల్లదొరలకు తెలుగువారి పౌరుష ప్రతాపాలను చూపించిన సీతారామరాజు దేశానికి స్వాతంత్య్రం, స్వరాజ్యం కావాలని మొట్టమొదటిగా నినదించారని, మన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రాణ త్యాగం చేశారన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలపై అల్లూరి స్ఫూర్తితో పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.
నేడు దేశాన్ని మతోన్మాద శక్తులు విచ్ఛిన్నం చేస్తూ,భారతీయతను ముక్కలు చేస్తున్నాయని విమర్శించారు, కేంద్రంలో బిజెపి ప్రభుత్వం విభజన హామీలు అమలు చేయకుండా తెలుగువారిని మోసం చేస్తుందన్నారు.అల్లూరిపై కేంద్రప్రభుత్వానికి ఎక్కడలేని హఠాత్తుగాఎలా పుట్టుకొచ్చిందోనని, ఇది కూడా రాజకీయం కోసమేనన్నారు. కార్యక్రమంలో సత్తిబాబు,కె రాంబాబు,కె జగన్నాదం,పి బుజ్జి,రాజేష్ పాల్గొన్నారు.
మైదానప్రాంతంలో..
రాజవొమ్మంగి: మండలంలోని లోతట్టు ప్రాంతమైన లోదొడ్డి పంచాయతీ, పూదీడు గ్రామంలో గిరిజన అల్లూరి సీతారామరాజు విగ్రహానికి గిరిజన సంఘం నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. గిరిజన సంఘం రాష్ట్ర నాయకులు, లోదొడ్డి సర్పంచ్ లోతా రామారావు మాట్లాడుతూ, స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు పూర్తవుతున్నా అల్లూరి ఆశయాలు నేటికీ అమలు కాలేదన్నారు, ఏజెన్సీ ప్రాంతంలో దోపిడికి వ్యతిరేకంగా ప్రారంభమైన పోరాటం బ్రిటిష్ వాడికి వ్యతిరేక పోరాటంగా మారిందని, ఇక్కడ భూమి, నీరు, అడవి ఆదివాసుల హక్కు అనేది నినాదంగానే ఉండిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో గిరిజన సంఘం నాయకులు పి రాజు బాబు, ఎం రమేష్,జె రాజు, తదితరులు పాల్గొన్నారు.
అల్లూరి స్ఫూర్తితో సమరశీల పోరాటం
ఎటపాక : సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా, ఆదివాసి హక్కుల కోసం ప్రాణత్యాగం చేసిన పోరాట స్ఫూర్తి అల్లూరి సీతారామరాజు అని సిపిఎం రంపచోడవరం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మర్లపాటి నాగేశ్వరరావు అన్నారు. మాధవరావు పేటలో ఇరపా అజరు అధ్యక్షతన అల్లూరి జయంతిలో ఎటపాక వైస్ ఎంపిపి పెనుబల్లి కుమారి అల్లూరి చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆదివాసీ హక్కుల కోసం, చట్టాల రక్షణ కోసం ఎర్రజెండా అండగా అల్లూరి సీతారామరాజు పోరాటస్ఫూర్తితో ఉద్యమం చేయాల్సిన సమయం ఆసన్నమైందన్నారు.కార్యక్రమంలో కాకా అర్జున్ దొర, పొడియం రత్తమ్మ , సవలం రాము, పెనుబల్లి వెంకన్నబాబు, జలకం ముద్దరాజు, సవలం చంద్రయ్య, ముర్రం వెంకటేష్, ముత్తయ్య పాల్గొన్నారు.