
గుర్తింపునకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి ప్రయాసపడుతున్నది. స్వాతంత్య్ర సమరయోధుడు రామరాజును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలుగువారిలో పట్టు సాధించవచ్చని కలలు కంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం వంటి వాటితో సహా తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచివేయడానికి బిజెపి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.
రెండు తెలుగు రాష్ట్రాలలో అత్యంత ప్రేమాభిమానాలను చూరగొన్న విప్లవ స్వాతంత్య్ర సమరయోధుడు అల్లూరి సీతారామరాజు. తన సహచరులైన గాం గంటం దొర, గాం మల్లుదొర, పడాలు, అగ్గిరాజు తదితరులతో కలిసి బ్రిటిష్ సామ్రాజ్యవాదంపై యుద్ధం చేశాడు. ఈ సంవత్సరం, రామరాజు 125వ జయంతి సంవత్సరం, మన 75వ స్వాతంత్య్ర దినోత్సవ సంవత్సరంతో కలిసి వచ్చింది. బిజెపి, సంఫ్ుపరివార్లు వారికి సహజసిద్ధంగా అబ్బిన, బతకనేర్చిన పద్ధతి ప్రకారం అల్లూరి సీతారామరాజు వారసత్వాన్ని సొంతం చేసుకునే ప్రయత్నంలో బిజీగా ఉన్నారు. సంఫ్ుపరివార్ సిద్ధాంతానికి అంకితమైన కార్యకర్తగా ప్రధాని నరేంద్ర మోడీ ఆంధ్రప్రదేశ్ పర్యటించి, రామరాజు విగ్రహాన్ని ఆవిష్కరించి, 'నివాళులు అర్పించే పనిలో ఉన్నారు. ప్రముఖ స్వాతంత్య్ర సమర యోధుడు నడయాడిన ప్రాంతాన్ని ''అభివృద్ధి'' చేయాలనే దానిపై అమితమైన ఆసక్తి వెలిబుచ్చుతున్నారు. నిజానికి వారు ఎంత ప్రయాసపడ్డా, గంగలో నీళ్లన్నీ తెచ్చి శుద్ధి చేసుకున్నా లేక అరేబియా అత్తర్లన్నీ పూసుకున్నా దేశ స్వాతంత్య్ర పోరాటానికి ఉద్దేశ్యపూర్వకంగానే బహుదూరంగా ఉన్నారన్న విషయం దాచినా దాగని సత్యం.
'ప్రజలకు, ముఖ్యంగా యువతకు అల్లూరి సీతారామరాజు మహోన్నత జీవితం గురించి కేంద్రప్రభుత్వం బోధ పరచాలని కోరుకుంటున్నది' అని ప్రకటించడం ద్వారా కేంద్ర పర్యాటక, సాంస్కృతిక శాఖామంత్రి కిషన్రెడ్డి ప్రకటన చేశారు. ఈ సందర్భాన్ని బిజెపి ఏవిధంగా సొంత ప్రయోజనాలకు వాడుకోదలుచుకున్నదో వివరిస్తుంది. మంత్రిగారి ప్రకటన ప్రకారం, విశాఖపట్నంలో అల్లూరి సీతారామరాజు మ్యూజియం ఏర్పాటు చేస్తారట. అల్లూరి పుట్టిన, విద్యనభ్యసించిన స్థలాన్ని, ఆయన పోరాటం చేసిన ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తారట. 'ఈ సీతారామరాజు ప్రాజెక్టు విషయంలో ప్రధాని స్వయంగా ఆసక్తి చూపిస్తున్నారు' అన్నారు. ఈ విధంగా రామరాజు స్వాతంత్య్ర పోరాటంలో ఒక పౌరాణిక వ్యక్తిలాగా కీర్తించటానికే ఈ ప్రాజెక్టు.
రాజ్యాధికారం చేతిలో ఉండటంతో సంఫ్ుపరివార్ తన ఎజెండాను పూర్తి స్థాయిలో ముందుకు తీసికెళుతున్నది. దాని అనుంగు సైనికులు కూడా ఈ విషయంలో సోమరిగా కూర్చోలేదు. చరిత్రను వక్రీకరించటంలోనూ, అబద్ధాలు సృష్టించటంలోనూ, బ్రిటిష్ దమన నీతికి వ్యతిరేకంగా అల్లూరి సీతారామరాజు సాగించిన పోరాటానికి మతతత్వ రంగులు రుద్దటంలో తలమునకలయి ఉన్నారు. అతను జన్మించిన కులం వల్ల, మతం వల్ల అతనికి ఖచ్చితమైన ఉన్నత కుల గుర్తింపును ఇవ్వడమే కాకుండా, రామరాజును 'హిందూ రుషి' గానూ, 'మతం వల్ల సాధించిన శక్తితో జ్ఞాన సంపన్నుడైన సన్యాసి' గానూ చూపే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇటీవల అనేక భాషల్లో రూపొందిన తెలుగు సినిమా చారిత్రక వాస్తవాలను ప్రచారంలో పెట్టటానికి బదులు రామరాజు చరిత్రను చిత్రవిచిత్ర కల్పితాలతో నింపి ఆ విధంగా వీరికి మేలు చేసింది.
1897లో జన్మించిన అల్లూరి సీతారామరాజు పుట్టిన ఊరు ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమ గోదావరి జిల్లా మోగల్లు గ్రామం. తల్లిదండ్రులు అతనికి పెట్టిన పేరు శ్రీరామరాజు, ఆ తరువాత పేరులో 'సీత'ను కలిపారు. వివిధ అధ్యయనాల ప్రకారం, తన సోదరినో, లేక తను ప్రేమించిన యువతినో (వలసవాద వ్యతిరేక పోరాటంలో నిమగమైనందువల్ల పెళ్లి చేసుకోలేదు.) గౌరవిస్తూ పేరులో కలిసింది. లేక అతని పట్ల ఉన్న ప్రేమాభిమానాల వల్ల ప్రజలు కలిపినది కూడా అయివుండవచ్చు.
ప్రొఫెసర్ మురళి పేర్కొన్నట్లు... అల్లూరి సీతారామరాజు 'రూపం అనేక కల్పనలతో తయారుచేయబడ్డది'. పొడవైన ఎర్రటి ఖద్దరు చొక్కా, నిక్కరు వేసుకుని గిరిజనులు నివసిస్తున్న ఏజెన్సీలలో తిరుగుతుండేవాడు. వైద్య మూలికలు పంచుతూ, జ్యోతిష్యం, హస్త సాముద్రికాలను కూడా చెపుతూ ఉండేవాడు. అతని నిరాడంబర జీవన విధానం, ఇతరులకు సహాయం చేసే స్వభావం గిరిజన ప్రజల నుండి గౌరవ మర్యాదలను పొందాయి. వారు అతనికి మంత్ర శక్తులను ఆపాదించారు. ఈ అపోహలకు రాజు అడ్డుపడలేదు. జనవరి30, 1922లో కేడిపేట ఏజెన్సీ పోలీస్ డిప్యూటీ సూపరింటెండెంట్ విచారిస్తున్నప్పుడు ప్రజలు 'తననొక పవిత్ర వ్యక్తి'గా చూస్తున్నారని, తను 'పితూరీ'ని ప్రారంభిస్తున్నట్టు నమ్ముతున్నారని, ''ప్రతి ఒక్కరు వచ్చి, తనని అడిగేవారని, అటువంటిది ఏమీలేదని తను ఖండించినప్పటికీ, ఆ ఖండనను చాలామంది అంగీకరించలేదు'' అని చెప్పిన్నట్టు ఆ నివేదికలు సూచిస్తున్నాయి.
అనేక మంది స్వాతంత్య్ర పోరాట యోధులు, 20 శతాబ్దం తొలి దశకాలలో ప్రజలను సమీకరించటానికి మతభావనలను, చిహ్నాలను వాడుకున్నారు. స్కూల్లో రామరాజు క్లాస్మేట్ అయిన అన్నపూర్ణయ్య ఇలా చెప్పుకొచ్చాడు... ''రామరాజు అయితే ఆధ్యాత్మిక సందేశాలు ఇచ్చేవాడు కానీ పాలవంటి అతని ఆధ్యాత్మికతలో చక్కెర లాంటి దేశభక్తి ఖచ్చితంగా మిళితమై ఉండేది.'' ఏమైనా, దీని అర్థం రాజు మతతత్వవాది కాదు. ఇతర మతాల పట్ల వివక్షత చూపలేదు. అతను నిచ్చెనమెట్ల కుల వ్యవస్థను, కుల వివక్షతలను వ్యతిరేకించాడు.
రాజు కుటుంబ వారసుల్లో ఒకరిని ఉటంకిస్తూ వచ్చిన నివేదికలు అతని (రాజు) తల్లి సనాతన ధర్మాన్ని పాటించేవారని, నిమ్న కులాల వ్యక్తులను తమ ఇంట్లోకి రానిచ్చేవారు కాదని పేర్కొంది. ఇటువంటి వాతావరణంలో పెరిగిన రాజు ఆ సనాతన విశ్వాసాలను అనుసరించలేదు. పైగా దీనికి విరుద్ధంగా వివక్షతల అమలుకు వ్యతిరేకిగా ఉన్నాడు. గిరిజన ప్రజలతో బాగా కలిసిపోయేవాడు, వారి ఇళ్ళల్లో బస చేసేవాడు, వారితో కలిసి భోజనం చేసేవాడు, వారిలో ఒకరిగా ఉన్నాడు. మరీ ముఖ్యంగా వారి సామాజిక-ఆర్థిక సమస్యల పట్ల సానుభూతితో ఉండేవాడు.
రామరాజును 'హిందూ మత నాయకుడు'గా చూపాలని ఆర్ఎస్ఎస్-బిజెపి లు చేస్తున్న ప్రయత్నాలు ఆయన వారసత్వానికి జరుగుతున్న ఘోర అపకారం. అదేవిధంగా కుల సంస్థలు రామరాజు పుట్టుకను బట్టి కులాన్ని ఆపాదించటం కూడా నేరమే. ఆయన విశాల మానవతా ప్రపంచ దృక్పథాన్ని తిరస్కరించడం తప్ప ఇది మరొకటి కాదు.
బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రామరాజు చేసిన తిరుగుబాటు ఆనాటి (1920 తొలినాళ్ళల్లో) వలసవాద ప్రభుత్వం పట్ల ప్రజలలో వున్న తీవ్ర వ్యతిరేకతకు ప్రతిరూపం. మన్యం ప్రాంతంలోని గిరిజనులలో రాజకీయ చైతన్యం పెంచటంలో రామరాజు దోహదపడ్డాడు. తరువాత ఆ మన్య ప్రాంతమే అతని పోరాట కార్యక్రమాలకు కేంద్రంగా ఉన్నది. గిరిజనుల సాధకబాధకాలను ఉపయోగించుకుని, వారిని ప్రేరేపించి, వారి ఆగ్రహాన్ని బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా రూపుదిద్దాడు. 1860 నాటి నుంచి మన్యం ప్రాంతం గిరిజనుల దోపిడీకి వ్యతిరేకంగా కుట్రలు కుతంత్రాలు నడవటం చూసింది. కానీ, 1922-1924 మధ్యకాలంలో రామరాజు చేసిన తిరుగుబాటు గుణాత్మకంగా భిన్నమైనది. ఈ తిరుగుబాటు రెండేళ్లు జరిగిందనే కాదు, ఈ తిరుగుబాటు స్వభావరీత్యా కూడా భిన్నమైనది. ప్రొఫెసర్ మురళి ఇలా రాశారు...''మునుపటి తిరుగుబాట్ల వరుసలో కాకుండా, రాజు వలసవాద వ్యతిరేక భావజాలంతో గిరిజనుల వ్యక్తిగత కష్టాలను జోడించగలిగాడు. తద్వారా కొండిపాంత ప్రజలలో కొత్త సామూహిక రాజకీయ చైతన్యాన్ని సృష్టించగలిగాడు. ఇదే అతని తిరుగుబాటును నిజమైన ప్రజల తిరుగుబాటుగా మార్చింది.''
పోడు వ్యవసాయం, చిన్నపాటి అటవీ ఉత్పత్తులు పోగుచేసుకునే హక్కును నిషేధించిన వలసరాజ్యంపై రామరాజు తిరుగుబాటు ప్రధానంగా జరిగింది. బ్రిటిష్ వారి పనులను చేస్తున్న కాంట్రాక్టర్లు రోడ్లు వేయటం లాంటి వివిధ పనులలో గిరిజనులను పెట్టుకునేవారు. ఆ కాంట్రాక్టర్లు సాగిస్తున్న దోపిడీకి వ్యతిరేకంగా కూడా ఈ తిరుగుబాటు జరిగింది. తిరుగుబాటుకు సంబంధించిన కారణాలపై ఏజెన్సీ ఆపరేషన్స్ కామాండింగ్ ఆఫీసర్ ఏ.జె.హప్పెల్ ఇచ్చిన విస్తృత నివేదిక ప్రకారం...''ప్రభుత్వం వేస్తున్న రహదారి పనులలో బలవంతంగా పనిచేయించటం, వ్యవసాయ సంక్షోభం, బాస్టియన్ వలన బాధలకు గురయిన మాజీ మున్సిఫ్లు, మాజీ ముఠాదార్లతో ఏజెన్సీ మండటానికి సిద్ధంగా ఉన్న భాస్వరం లాగా ఉండింది. అదే గిరిజనులను పోరాటంలోకి నెట్టింది.'' బ్రిటిషర్ల ఆర్థిక సామాజిక దోపిడీకి వ్యతిరేకంగా గిరిజనులు చేసిన తిరుగుబాటు ఇది.
తిరుగుబాటుతో బ్రిటిష్వారు అదిరిపోయారు. రామరాజును పట్టుకోవటానికి, తిరుగుబాటును అణచటానికి పెద్దఎత్తున సైనిక బలగాలను దింపారు. రాజును పట్టుకోవటంలో పోలీసులు విఫలం అవటంతో, గెరిల్లా యుద్ధ తంత్రాలలో ఆరితేరిన మలబార్ స్పెషల్ పోలీసులను బ్రిటిష్ దింపింది. ఆ తరువాత ఈ బలగాలకు అస్సాం రైఫిల్స్ను జతకలిపింది. ఈ కార్యక్రమానికి బ్రిటిషర్లు మొత్తంగా ఆనాటి రూ.40 లక్షలు ఖర్చు చేయాల్సి వచ్చింది. గ్రామాలను తగలబెట్టారు, పంటలను ధ్వంసం చేశారు, ఆడవారిని బలాత్కరించారు, ప్రజలను అమానుషమైన పద్ధతిలో రకరకాలుగా హింసించారు. ఇంత క్రూరమైన అత్యాచారాలు తమపై జరిగినప్పటికీ ప్రజలు తిరుగుబాటు పట్ల అంకితభావంతో ఉన్నారు. ఎన్నడూ రామరాజునిగాని, అతని తిరుగుబాటు బృందానికి గాని ద్రోహం చేయలేదు. 1924లో రామరాజును పట్టుకుని కాల్చిన తరువాతనే బ్రిటిష్వారు గాలి పీల్చుకోగలిగారు. అప్పటికి రామరాజు వయస్సు 27 ఏళ్లు.
రామరాజు యొక్క వారసత్వం ఆర్థిక దోపిడీకి, కులవివక్షకు వ్యతిరేకంగా, ఓరిమితో ఉండటం కోసం నిలబడటంలో ఉంది. ఇది సంఫ్ుపరివార్ డిఎన్ఎకే వ్యతిరేకం. బ్రిటిష్ వలస పాలనతో పోరాడిన చరిత్ర దీనికి లేదు. పోరాడి సాధించుకున్న సార్వభౌమత్వం, స్వాతంత్య్రంపై రాజీపడటానికి బిజెపి నాయకత్వం లోని ప్రభుత్వం నానావిధాలుగా ప్రయాసపడుతున్నది.
అందరినీ కలుపుకునే (ఇన్క్లూజివ్) సమాజాన్ని నిర్మిస్తామని ఎన్ని బడాయి మాటలు చెప్పినప్పటికీ ఆర్ఎస్ఎస్-బిజెపిల చేతలు మాత్రం 'అగ్ర కుల' ఆధిపత్యం వైపేనని సూచిస్తున్నాయి. రిజర్వేషన్ వ్యతిరేక ఉద్యమాలకు, దేశం నలుమూలలా దళితులు, ఆదివాసీలపై జరిగే దాడులు, అకృత్యాలపై బహిరంగంగాను, చాటుమాటుగా తెలిపే మద్దతు, దళితులు, ఆదివాసీలకు మద్దతుగా నిజంగా ఉపయోగపడే అనేక ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఒక పద్ధతి ప్రకారం తొలగిస్తూ పోవటం, వీటితోపాటు ప్రయివేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించే చట్టాలు చేయటానికి నిరాకరించటం-ఇవన్నీ నిమ్న కులాల పట్ల బిజెపి, ఆర్ఎస్ఎస్లకు వున్న స్వాభావిక వ్యతిరేక ధోరణికి రుజువులు.
ప్రస్తుతం మైనార్టీలపై జరుగుతున్న దాడులు, ప్రజలు అనుసరించే మత విశ్వాసాల ఆధారంగా బుద్ధిపూర్వకంగా వారి మధ్య చీలికలు తెచ్చే ప్రయత్నం, ఎవరు ఏ దుస్తులు వేసుకున్నారు, ఏం తింటున్నారు లాంటివన్నీ రామరాజు దేని కోసం నిలబడ్డాడో దానికి విరుద్ధం. పైన చెప్పిన ఈ కారణాలతో, ఆర్ఎస్ఎస్-బిజెపిలకు అల్లూరి సీతారామరాజును సొంతం చేసుకునే మాట అటుంచి, ఆయనను గురించి మాట్లాడే అర్హత కూడా లేదు.
భారత స్వాతంత్య్ర 75వ వార్షికోత్సవ సంవత్సరాన్ని పురస్కరించుకుని వాస్తవాలను వక్రీకరించేందుకు సంఫ్ుపరివార్ ప్రయత్నిస్తున్నది. స్వతంత్రం కోసం జరిగిన పోరాటంలో సంఫ్ుపరివార్కు లేని పాత్రను ఆపాదించడానికి గట్టిగా ప్రయత్నిస్తున్నది. వలసపాలన నుండి దేశ స్వాతంత్య్రం కోసం మాత్రమే కాక, కులమతాల ఆధారంగా ప్రజల మధ్య వివక్షతను చూపే తిరోగమన పద్ధతులు, ఆలోచనలకు వ్యతిరేకంగా నిలబడిన ఎందరో అమరులున్నారు. గుర్తింపునకు నోచుకోని అమరవీరుల జీవితాలను వెలుగులోకి తెస్తామనే పేరుతో వారి వారసత్వాన్ని సొంతం చేసుకోవాలని బిజెపి ప్రయాసపడుతున్నది. స్వాతంత్య్ర సమరయోధుడు రామరాజును తన ఖాతాలో వేసుకోవడం ద్వారా తెలుగువారిలో పట్టు సాధించవచ్చని కలలు కంటోంది. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోవడం, విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటీకరించేందుకు చేస్తున్న ప్రయత్నాలు, అటవీ హక్కుల చట్టం నిర్వీర్యం వంటి వాటితో సహా తమ ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల జ్ఞాపకాల నుంచి తుడిచివేయడానికి బిజెపి ఈ సందర్భాన్ని ఉపయోగించుకుంటోంది.
ప్రజలకున్న జ్ఞాపకశక్తి తక్కువది కాదు. మరచిపోయి క్షమించే స్థితిలో వారు లేరని...పాపం బిజెపి గ్రహించలేకపోతున్నది. అల్లూరి సీతారామరాజు బోధించిన ఒక విషయం ప్రజలకు బాగా గుర్తుంది... 'దేశ శ్రేయస్సు కోసం, మీరు చేయవలసింది ఏమీ లేదు, పోరాటం కొనసాగించటమే.'
అరుణ్ కుమార్ ( వ్యాసకర్త : సిపిఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు )