
ప్రజాశక్తి-గొలుగొండ:అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమ పథకాలు అందిస్తున్న ఘనత జగన్మోహన్ రెడ్డికే దక్కుతుందని నర్సీపట్నం ఎమ్మెల్యే పెట్ల ఉమాశంకర్ గణేష్ అన్నారు. మండలంలో గురువారం ఏఎల్ పురంలో గడపగడపకు మన ప్రభుత్వ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముందుగా వైయస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహానికి పూలమాలలు వేశారు. గొల్లపేట విధిలో ఇంటింటికి వెళ్ళి ప్రభుత్వ పధకాలపై మహిళలను అడిగి తెలుసుకున్నారు. జగనన్న కాలనీ నిర్మాణంలో ఉన్న ఇళ్లను పరిశీలించి లబ్ధిదారులతో మాట్లాడారు. గ్రామంలో డ్రైనేజీల నిర్మాణం చేపట్టాలని పలువురు ప్రజలు ఎమ్మెల్యేకు విన్నవించారు. అనంతరం వెలుగు సిబ్బంది అధ్యర్యంలో డ్వాక్రా మహిళలకు బ్యాంకుల ద్వారా గ్రామ సంఘాలకు అందిస్తున్న రుణాలకు సంబంధించిన కోటి ఇరవై మూడు లక్షల చెక్కు ను అందజేశారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మార్కెట్ కమిటీ చైర్మన్ చిటికెల భాస్కర్ నాయుడు, జెడ్పిటిసి సుర్ల గిరిబాబు, ఎంపీపీ జి మమణికుమారి, వైసిపి ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షురాలు లోచల సుజాత, పార్టీ అధ్యక్షుడు లెక్కల సత్యనారాయణ, ఈవోపీఆర్డి రఘురాం, ఆర్డబ్ల్యూఎస్ జెఈ సుదీష్న, వెలుగు ఏపీఎం మంగ, స్థానిక ఎంపీటీసీ చింతల బుల్లి ప్రసాద్, వైసిపి, నాయకులు, అధిక సంఖ్యలో కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
ప్రజాశక్తి-కోటవురట్ల: మండలంలో అక్షాహెబ్ పేటలో స్థానిక ఎమ్మెల్యే గొల్ల బాబురావు గడపగడపకు మన కార్యక్రమంలో భాగంగా గురువారం పర్యటించారు. పలువురు గ్రామంలో తాగునీటి సమస్యపై ఎమ్మెల్యే దృష్టికి తీసుకువెళ్లారు. పారిశుధ్యం అధ్వానంగా ఉందని, కాలువల నిర్మాణం చేపట్టాలని కోరారు. పలువురు గ్రామస్తులు కాలనీ ఇల్లు మంజూరుకు వేడుకున్నారు. ప్రభుత్వం అందిస్తున్న సంక్షేమ పథకాలపై ఆయన ఆరా తీశారు. ఈ సందర్భంగా స్థానిక విలేకరులతో మాట్లాడుతూ రానున్న రోజుల్లో వైసిపి ప్రభుత్వం మళ్లీ అధికారం చేపడుతుందని తెలిపారు. సంక్షేమ పథకాలు యధావిధిగా కొనసాగుతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో చంద్రశేఖర్, తహసిల్దార్ జానకమ్మ, హౌసింగ్ ఏఈ జగదీశ్వరరావు, పిఆర్ ఇంజనీర్ వర్మ, ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీర్ కరుణ, బికెపల్లి ఎంపీటీసీ రాంబాబు, చిన్న బొడ్డేపల్లి సర్పంచ్ శివరాం, పలువురు వైసిపి నాయకులు పాల్గొన్నారు.