Nov 24,2022 16:21

జైపూర్‌  :   రాజస్థాన్‌లో కాంగ్రెస్‌ నేతల మధ్య విబేధాలు మరోసారి భగ్గుమన్నాయి. తన ప్రత్యర్థి సచిన్‌పైలెట్‌పై రాజస్థాన్‌ ముఖ్యమంత్రి అశోక్‌గెహ్లాట్‌ విరుచుకుపడ్డారు. గురువారం జాతీయ మీడియాకి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ద్రోహి, విశ్వాసఘాతకుడు ఎన్నటికీ ముఖ్యమంత్రి కాలేరని అన్నారు. పది మంది ఎమ్మెల్యేలు కూడా లేని వారిని, తిరుగుబాటుదారుడైన సచిన్‌పైలెట్‌ని కాంగ్రెస్‌ అధిష్టానం సిఎంగా నియమించదని అన్నారు. ఆయన పార్టీని మోసం చేశారని, ద్రోహి అని అన్నారు. ఒక పార్టీ అధ్యక్షుడు తన సొంత ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూడటం బహుశా భారత్‌లో ఇదే మొదటిదని 2020లో సచిన్‌ తిరుగుబాటునుద్దేశించి పేర్కొన్నారు. ఈ కుట్రకు బిజెపి నిధులు సమకూర్చిందని, అమిత్‌ షా సహా బిజెపి సీనియర్‌ నేతలందరూ ఇందులో పాల్గన్నారని అన్నారు. సచిన్‌ పైలెట్‌ ఢిల్లీలో ఇద్దరు కేంద్ర మంత్రులు అమిత్‌ షా, ధర్మేంద్ర ప్రధాన్‌లతో సమావేశమయ్యారని అన్నారు. తన ప్రత్యర్థి సచిన్‌ వర్గంలో చేరిన ఎమ్మెల్యేల్లో కొందరికి రూ. 5 కోట్లు, మరికొందరికి రూ.10 కోట్లు అందాయని అన్నారు.