
ప్రజాశక్తి-అద్దంకి: అద్దంకి భవిత కేంద్రాన్ని రిటైర్డ్ ఎల్ఐసి డెవలప్మెంట్ అధికారి కుందుర్తి అనంత రామకృష్ణ కుటుంబ సభ్యులు సోమవారం సందర్శించారు. కేంద్రంలోని ప్రత్యేక అవసరాలుగల విద్యార్థులకు స్వీట్లు, పండ్లు పంచిపెట్టారు. అనంతరం విద్యార్థులకు నోట్ పుస్తకాలు అందించారు. ఐఈఆర్టీ కొంగల శ్రీనివాస్ మాట్లాడుతూ వీరు భవిత కేంద్రం అభివృద్ధికి మూలస్తంభం లాంటి వారని, ఇటువంటి విద్యార్థులంటే ఎంతో ఇష్టమని అన్నారు. భవిత కేంద్రం ప్రకాశం జిల్లాలోనే ఒక మోడల్ కేంద్రంగా రూపుదిద్దుకుందంటే ప్రధాన కారణం రామకష్ణ అని, తను సహాయం చేసి ఎంతోమంది దాతలను కలిసి వారి చేత విద్యార్థులకు అవసరమైన సుమారు రూ.5 లక్షల విలువగల పరికరాలను అందించటంలో ప్రముఖపాత్ర పోషించారని పేర్కొన్నారు. ఐఈఆర్టీ పాలపర్తి యోనా మాట్లాడుతూ రామకృష్ణ సేవలు మరువలేనివని, ప్రస్తుతం గుంటూరులో ఉంటూ వ్యిద్యార్థులతో ముచ్చటించాలని ఇక్కడకు వచ్చామని తెలిపారు. అనంతరం ఫిజియోథెరపీ కేంద్రాన్ని సందర్శించి, ప్రతిరోజూ భవిత కేంద్రంలో ఉపాధ్యాయులు అందిస్తున్న సేవలను తల్లిదండ్రులు వినియోగించుకొవాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫిజియో థెరపిస్టు డాక్టర్ ఇందిరా ప్రియదర్శిని, ఆయా లక్ష్మి పాల్గొన్నారు.