Mar 24,2023 23:46
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ విజయకృష్ణన్‌, చిత్రంలో జెసి శ్రీనివాసులు

ప్రజాశక్తి-బాపట్ల జిల్లా: ప్రభుత్వ ప్రాధాన్యత భవనాల నిర్మాణ పనులు సత్వరమే పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్‌ కె విజయకృష్ణన్‌ ఆదేశించారు. అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం స్థానిక స్పందన సమావేశ మందిరంలో సమీక్షించారు. ఉపాధి హామీ పథకం నిధుల అనుసంధానంతో చేపడుతున్న గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాల నిర్మాణాలలో పురోగతి కనిపించాలని కలెక్టర్‌ చెప్పారు. బాపట్ల జిల్లాకు 401గ్రామ సచివాలయాల భవనాలు మంజూరు కాగా నేటికీ 13 భవనాలు నిర్మాణం మొదలు కాలేదన్నారు. మరో 15 పునాది స్థాయికి దిగువన ఉండగా, మిగిలిన 12 భవన నిర్మాణాలను ఏజెన్సీలకు కేటాయించే ప్రక్రియలో ఉండడంతో అధికారులపై కలెక్టర్‌ అసహనం వ్యక్తం చేశారు. 315 రైతు భరోసా కేంద్రాలు మంజూరు కాగా 56 భవనాల నిర్మాణ పనులు పెండింగ్‌లో ఉండడంపై ఆరా తీశారు. 343 వైఎస్‌ఆర్‌ హెల్త్‌ క్లినిక్‌ భవనాలు మంజూరు కాగా 75 పెండింగ్‌లో ఉండడం ఏమిటని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ భవనాల నిర్మాణం ద్వారా అభివృద్ధి పనులు జరగడంతో పాటు నిరుపేదలకు ఉపాధి కల్పించే అంశాలను అధికారులు విస్మరించడం మంచి పద్ధతి కాదని హెచ్చరించారు. గడప గడపకూ మన ప్రభుత్వంలో గుర్తించిన పనులు 497 మంజూరు కాగా, 49 పనులు నేటికీ ప్రారంభించకపోవడంపై తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అద్దంకి, బాపట్ల రూరల్‌, పర్చూరు మండలాలలో పనుల పురోగతి కనిపించక పోవడంతో అధికారులను నిలదీశారు. ప్రజల అవసరాలను గుర్తించలేకపోతే అధికారులు ఎలా పనిచేస్తారన్నారు. పునరావృతమవుతున్న స్పందన అర్జీలను అధికారులు గడువులోగా పరిష్కరించక పోతే ప్రభుత్వం విధులను ఎలా నిర్వహిస్తారని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. నెలలోనే 34 అర్జీలు పునరావృతమయ్యాయన్నారు. ఇటీవల 1,474 అర్జీలు అధికారులు పరిష్కరించినప్పటికీ, 46 అర్జీలను క్రమపద్ధతిలో ప్రభుత్వ మార్గదర్శకాలను అనుసరించ లేదన్నారు. 399 అర్జీలు స్పందన పోర్టల్‌, జగనన్నకు చెబుతాం వెబ్‌ సైట్లో వచ్చాయన్నారు. వీటిని సక్రమంగా పరిష్కరించలేకపోతే మీకిచ్చే వేతనాలు వ్యర్థమవుతున్నా యనే భావించాల్సివస్తుందన్నారు. జగనన్న కాలనీలలోని లబ్ధిదారులు తమ గృహాలను ఎందుకు నిర్మించుకోవడం లేదో అధికారులు సర్వే నిర్వహించి నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌ ఆదేశించారు. మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక బాధ్యత తీసుకొని చిత్తశుద్ధితో సర్వే నిర్వహించాలని కలెక్టర్‌ సూచించారు. సంక్షేమ కార్యక్రమాల అమలులో వేమూరు నియోజకవర్గంలోని అధికారుల పనితీరు సరిగా లేదని మందలించారు. అధికారులు నిబద్ధతతో పనిచేస్తే గృహ నిర్మాణాలలో పురోగతి కనిపిస్తుందన్నారు. రాజకీయ ఒత్తిళ్లను పక్కనపెట్టి లబ్ధిదారులకు అన్ని విధాలుగా ప్రభుత్వ సంక్షేమ పథకాలతో లబ్ధి చేకూర్చడమే అధికారుల లక్ష్యమన్నారు. ప్రధానంగా జగనన్న కాలనీలలో తాగునీరు, విద్యుత్‌ వంటి ప్రాథమిక సౌకర్యాలు కల్పించాలని కలెక్టర్‌ సూచించారు. అర్హులైన లబ్ధిదారులకు సంక్షేమ ఫలాలు అందకపోతే అధికారులే బాధ్యులవుతారని హెచ్చరించారు. జిల్లా వ్యాప్తంగా 174 వాలంటీర్ల పోస్టులు ఖాళీగా ఉన్నాయని, తక్షణమే వాటిని భర్తీ చేసి ఆ ప్రాంతాలలో ప్రభుత్వ సేవలు అందేలా చూడాలన్నారు. ముఖ్యంగా గర్భిణులకు పోషకాహారం అందిస్తూ.. వారిలో రక్తహీనత, పోషణ లోపం నివారించే ప్రక్రియను సమర్థంగా చేపట్టాలన్నారు. పలు పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలపై మండలాలు, గ్రామస్థాయిలో పురోగతిపై కలెక్టర్‌ క్షుణ్ణంగా సమీక్షించారు. సమావేశంలో జాయింట్‌ కలెక్టర్‌ డాక్టర్‌ కె శ్రీనివాసులు, వివిధ శాఖల జిల్లా, మండల అధికారులు పాల్గొన్నారు.