- క్యూ3లో 7 శాతం వృద్ధి
న్యూఢిల్లీ: ముకేష్ అంబానీకి చెందిన రిలయన్స్ ఇండిస్టీస్ అంచనాలు మించి రెవెన్యూ, నికర లాభాలు సాధించింది. ప్రస్తుత ఆర్ధిక సంవత్సరం డిసెంబర్తో ముగిసిన మూడో త్రైమాసికం (క్యూ3)లో 7.4 శాతం వృద్ధితో రూ.18,540 కోట్ల నికర లాభాలు సాధించింది. అదే సమయంలో కంపెనీ రెవెన్యూ 7 శాతం పెరిగి రూ.2.43 లక్షల కోట్లుగా చోటు చేసుకుంది. రిలయన్స్ రూ.18,330 కోట్ల మేర లాభాలు, రూ.2.39 లక్షల కోట్ల రెవెన్యూ సాధించొచ్చని మార్కెట్ నిపుణులు వేసిన అంచనాల కంటే మెరుగైన ఫలితాలు ప్రకటించడం విశేషం.
జియో లాభాల జోరు..
రిలయన్స్ జియో ఇన్ఫోకమ్ 2024-25 క్యూ3లో 26 శాతం వృద్ధితో రూ.6,861 కోట్ల నికర లాభాలు ప్రకటించింది. ఇంతక్రితం ఏడాది ఇదే క్యూ3లో రూ.5,447 కోట్ల లాభాలు నమోదు చేసింది. ఇదే సమయంలో రూ.27,697 కోట్లుగా ఉన్న రెవెన్యూ.. గడిచిన క్యూ3లో 19.4 శాతం వృద్ధితో రూ.33,074 కోట్లకు ఎగిసింది. ఏడాదికేడాదితో పోల్చితే గడిచిన క్యూ3లో వినియోగదారుడి నుంచి సగటు రెవెన్యూ (ఎఆర్పియు) 12 శాతం పెరిగి రూ.203.3గా నమోదయ్యిందని తెలిపింది. 2024 డిసెంబర్ ముగింపు నాటికి జియో వినియోగదారుల సంఖ్య 48.2 కోట్లుగా ఉందని తెలిపింది.