హైదరాబాద్ : ప్రభుత్వ రంగంలోని బ్యాంక్ ఆఫ్ ఇండియా (బిఒఐ) ఫిక్సుడ్ డిపాజిట్లపై వడ్డీరేట్లను తగ్గించింది. ఇప్పటికే 400 రోజుల ఎఫ్డి స్కీమ్ను వెనక్కి తీసుకున్న బిఒఐ తాజాగా మిగితా ఎఫ్డిలపై వడ్డీ రేట్ల తగ్గింపును ప్రకటించింది. ఇది 15 ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తుందని తెలిపింది. ఫిక్సుడ్ డిపాజిట్లపై 25 బేసిస్ పాయింట్లు (పావు శాతం) వరకు వడ్డీ రేటును తగ్గించినట్లు బిఒఐ వెల్లడించింది. దీంతో 91-179 రోజుల ఎఫ్డిపై వడ్డీ 25 బేసిస్ పాయింట్లు తగ్గి 4.25 శాతానికి చేర్చింది. 180 రోజుల నుంచి ఏడాది కాలపరిమితి ఎఫ్డిపై 5.75 శాతానికి, 1-2 ఏళ్ల ఎఫ్డిలపై వడ్డీని 6.75 శాతంగా నిర్ణయించింది.
