మైక్రోసాఫ్ట్‌లో కోతలు..!

Jan 9,2025 23:59 #Business, #Cuts, #Microsoft
  • కొత్త ఏడాదిలో టెకీల్లో ఆందోళన

న్యూఢిల్లీ : గ్లోబల్‌ దిగ్గజ టెక్నాలజీ కంపెనీ మైక్రోసాఫ్ట్‌ కొత్త ఏడాదిలో తమ ఉద్యోగులను తీవ్ర కలవరానికి గురి చేస్తోంది. ఆ సంస్థలో ఉద్యోగులను తొలగించనున్నట్లు వెల్లడించింది. కరోనా తర్వాత వేగంగా పుంజుకున్న ఐటి రంగంలో తమ ఉద్యోగాలకు డోకా లేదని భావించిన వారికి ఇది ఆందోళనకర అంశమే. ఈ కొత్త ఏడాది 2025లో ఉద్యోగాల కోతల కసరత్తును ప్రారంభించినట్లు రిపోర్టులు వస్తోన్నాయి. ఇటీవలి వరకు ఆర్థిక మాంద్యం, ఖర్చుల నియంత్రణ, ఎఐ సాకులతో సిబ్బందికి ఎసరు పెట్టిన టెక్నాలజీ కంపెనీలు.. తాజాగా ప్రతిభ లేని వారిని ఇంటికి పంపిస్తున్నామని కొత్త పాటను అందుకున్నాయి. మైక్రోసాఫ్ట్‌ కూడా ఇదే తరహా ప్రకటన చేసింది. తమ కంపెనీలో వివిధ విభాగాల్లో పని చేస్తున్న వారిలో కొంత మందికి ఉద్వాసన పలుకుతున్నట్లు మైక్రోసాఫ్ట్‌ వర్గాలు వెల్లడించాయని అంతర్జాతీయ మీడియాల్లో వార్తలు వచ్చాయి. ఈ క్రమంలో టెక్‌, ఐటి రంగంలోని ఉద్యోగుల్లో మళ్లీ ఆందోళన మొదలయ్యింది.

మైక్రోసాఫ్ట్‌లో మెరుగైన పనితీరు కనబరిచిన ఉద్యోగులను ప్రోత్సహిస్తామని, కొత్త విషయాలు నేర్చుకునేందుకు, వృత్తి జీవితంలో ఎదిగేందుకు తోడుంటామని.. కానీ పని చేయని వారిపై తగిన చర్యలు తీసుకుంటున్నట్లు ఆ వర్గాలు పేర్కొన్నాయి. మెరుగైన పనితీరు చూపించే వారి సంఖ్యను పెంచుకునే ప్రయత్నంలో భాగంగా కొంత మందిపై వేటు వేయాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాయి. కంపెనీలోని మొత్తం ఉద్యోగుల్లో సుమారు 1 శాతం మందిని తొలగిస్తున్నట్లు సమాచారం. ఈ సంస్థ 2023లోనూ దాదాపు 10,000 మంది ఉద్యోగులను రోడ్డున పడేసింది. ఇది మొత్తం ఉద్యోగుల్లో 5 శాతంగా ఉంది. గత సంవత్సరం 2024లోనూ గేమింగ్‌ విభాగం నుంచి సుమారు 2000 మందికి ఉద్వాసన పలికింది.

ఆర్థిక ఒత్తిళ్లు, మాంద్యం భయాలు, సరికొత్త టెక్నాలజీ అమలు వ్యూహాల నేపథ్యంలో ఈ 2025లోనూ గూగుల్‌, మైక్రోసాఫ్ట్‌ వంటి దిగ్గజ సంస్థల్లో లేఆఫ్స్‌ ఉండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. తమ ఉద్యోగం ఎప్పుడు ఊడుతుందో తెలియని పరిస్థితుల్లో పని చేస్తున్నామని గతంలో పలువురు టెకీలు సోషల్‌ మీడియా వేదికగా తమ ఆవేదన తెలియజేశారు. మందగమనం, ఆర్ధిక ఒత్తిళ్ల మధ్య ఇతర టెక్‌ కంపెనీల్లోనూ తొలుగింపులు ఉండొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు.

➡️