బిజినెస్ : దేశీయ మార్కెట్లు మంగళవారం ఫ్లాట్గా ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ మార్కెట్లలో సంకేతాలు పతనంగా కనిపిస్తుండటంతో మదుపర్లు అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు. దీంతో ఐదు రోజులుగా కొనసాగుతోన్న సూచీల దూకుడు కాస్త నెమ్మదించింది. సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో, నిఫ్టీ 24వేల ఎగువన ట్రేడింగ్ మొదలుపెట్టాయి. ఉదయం 9 గంటల 30 నిముషాల సమయంలో సెన్సెక్స్ 72 పాయింట్ల లాభంతో 79,480 వద్ద ట్రేడవుతుండగా, నిఫ్టీ 20 పాయింట్ల లాభంతో 24,146 వద్ద ఉంది. నిఫ్టీ సూచీలో టాటా స్టీల్, కొటక్ మహీంద్రా, శ్రీరామ్ ఫైనాన్స్, బజాజ్ ఫైనాన్స్, భారత్ ఎలక్ట్రానిక్స్ షేర్లు లాభాల్లో కదలాడుతున్నాయి. ఇండస్ఇండ్ బ్యాంక్, హీరో మోటార్కార్ప్ లిమిటెడ్, బజాజ్ ఆటో, ఇన్ఫోసిస్, పవర్ గ్రిడ్ కార్పొరేషన్ షేర్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అమెరికా మార్కెట్లు సోమవారం నష్టాల్లో కొనసాగాయి. ఫెడ్ రిజర్వ్ ఛైర్మన్ పావెల్పై డొనాల్డ్ ట్రంప్ విసుర్లు కొనసాగుతుండడం ఇందుకు నేపథ్యం. ఆ ప్రభావంతో ఆసియా మార్కెట్లు మిశ్రమంగా కదలాడుతున్నాయి.
